‘ప్రపంచ ఆకలి సూచీ-2021’లో 116 దేశాల జాబితాలో భారత్ 101వ స్థానాన్ని పొందింది. అలాగే అవినీతి సూచీలో 2014లో 70వ స్థానంలో నిలిచిన భారత్, 2021లో 85వ స్థానం పొందింది. ఇలా.. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో అన్ని సూచీల్లోనూ దిగజారింది. ప్రజల వాస్తవిక జీవన ప్రమాణాలకు అద్దంపట్టే అన్నిరకాల సూచీల్లో భారత్ అత్యంత దిగువ స్థానాల్లోకి చేరుకున్నది. దేశ జనాభాలో 15-29 ఏండ్ల యువత దాదాపు 50 శాతం ఉంది. దేశంలో సమస్యలు ఇలాగే ఉంటే.. ఈ యువత హింసామార్గం పట్టే ప్రమాదం ఉంది.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేని చీకటి అధ్యాయం కొనసాగుతున్నది. కేంద్రంలో అతి జాతీయవాద, ఛాందసవాద బీజేపీ అధికారాన్ని చేపట్టి ఎనిమిదేండ్లయింది. ఈ కాలంలో బీజేపీ చేసింది విద్వేష రాజకీయాలు, పొరుగు దేశాలతో అనవసర ఘర్షణలో దేశ సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడం. ఉద్దేశపూర్వక వివాదాలతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం. ఇన్ని చేసి కూడా కేవలం 32 శాతం ఓట్లతో అధికారం చేపట్టింది. అభివృద్ధికి కొలమానంగా భావించే పలు సూచికల్ల్లోనూ ఈ ఎనిమిదేండ్లలో దేశం వెనకబడిపోయింది.
గతేడాది భారత ఆర్థికవ్యవస్థ ఉత్పత్తి రంగం లో 1.1 కోట్ల ఉద్యోగాలను కొల్పోయిందని, నిరుద్యోగిత రేటు 7.83 శాతానికి చేరుకున్నదని, ఒక్క మార్చిలోనే 38 లక్షల శ్రామికులు పని కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి’ అనే సంస్థ తెలియజేసింది. అలాగే ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచి గరిష్ఠానికి చేరుకొన్నాయని వెల్లడించింది. మరోవైపు, ఐరాస అభివృద్ధి కార్యక్రమం వెలువరించే మానవాభివృద్ధి సూచికకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాధాన్యం ఉన్నది. అమర్త్యసేన్, పాక్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్హక్- ఆదాయం, ఆరోగ్యం, విద్య ప్రాతిపదికగా మానవాభివృద్ధి సూచికను రూపొందించారు. 2020 సూచికలో భారత్కు 131వ స్థానం లభించింది. మనం దిగువ మధ్య శ్రేణి జీవనప్రమాణాలను, కడు దయనీయ పేదరికం కలిగి ఉన్నామనే విషయాన్ని 131వ స్థానం తెలియజేస్తున్నది.
ప్రపంచబ్యాంకు రూపొందించిన సంపన్న ఆర్థిక వ్యవస్థ గల దేశాల జాబితాలో భారత్ 5వ స్థానం లో ఉన్నది. కానీ ఏం లాభం?.. సంపద పెరుగుతు న్నకొద్దీ క్రమంగా సమాజం అట్టడుగు వర్గాలకు చేరుతున్నదనే సిద్ధాంతం భారత్లో ఆచరణలో విఫలమవుతున్నది. సంపద కింది వర్గాల ప్రజలకు చేరకుండా పైనున్న కుబేరుల వద్దే కేంద్రీకృతం అవుతున్నది. సంపదను వికేంద్రీకరించాలనే రాజ్యాంగం ఆదర్శానికి తూట్లు పొడిచే వ్యతిరేక పాలనా విధానాలతో ఈ స్థితి నెలకొన్నది. ‘ఆక్స్ఫామ్’ సంస్థ నివేదిక ప్రకారం భారత్లో 10 శాతంగా ఉన్న ధనవంతుల వద్ద 77 శాతం జాతీ య సంపద ఉన్నది. 13.6 కోట్ల ప్రజలు 2014 నుంచి అప్పుల పాలై దుర్భర దారిద్య్రాన్ని అనుభవి స్తున్నారు.
భారత్లో బిలియనీర్ల సంపద ఏటా 39 శాతం పెరుగుతున్నది. ప్రజస్వామ్యస్ఫూర్తిని ఆచరిస్తున్న దేశాలు, లాటిన్ ఆమెరికా దేశాలు, ఆగ్నేయా సియా దేశాలు ఆర్థికరంగంలో స్వావలంబన కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ అధీనంలోనే కీలక పరిశ్రమలను స్థాపిస్తున్నాయి. దేశ, విదేశీ పెట్టుబ డుదారుల అధీనంలో ఉన్న పరిశ్రమలను జాతీ యం చేశాయి. సంపన్నులపై అధిక పన్నులు విధించడం ద్వారా వచ్చిన ఆదాయంతో తమ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుకుంటున్నాయి. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ప్రభుత్వాలు స్థాపించిన పరిశ్రమల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రత్యేక ఏర్పాటుచేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే.
యేల్, కొలంబియా విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదిక సంయుక్తంగా రూపొందించిన ‘పర్యావరణ పరిరక్షణ సూచిక-2021’లోని 188 దేశాల జాబితాలో భారత్కు 155వ స్థానం లభించింది. గాలి నాణ్యత, నీటి వనరుల రక్షణ, పరిశుభ్రత, ఆవాసం, జీవ వైవిధ్యం, వ్యవసాయం, అడవుల పెంపకం వంటి 24 అంశాల ఆధారంగా ఈ సూచికను రూపొందిస్తారు. భారత్లో గత ఎనిమిదేండ్ల నుంచి అభివృద్ధి పేరుతో కొనసాగిన విస్తరణ, పర్యావరణ విధ్వంసం ఎంత తీవ్రంగా ఉందో 155వ స్థానం తెలియజేస్తున్నది.
వన్యమృగ సంరక్షణ చట్టం-1972, అటవీ సంరక్షణ చట్టాలను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించి విచక్షణారహితంగా కార్పొరేట్ కంపెనీలకు అటవీ భూములను అప్పగిస్తున్నది. వనరుల దోపిడీకి మద్దతిస్తున్నది. అడవులను కాపాడుకుంటూ ప్రకృతితో సహజీవన సంబంధం కొనసాగిస్తున్న ఆదివాసులను అడవి నుంచి తరిమి వేయటానికి కుట్రలు పన్నుతున్నది.
‘ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూ ట్’ వెలువరించిన ప్రపంచ పోషకాహార సూచీ-2021 ప్రకారం పోషకాహారలోపంతో ఎత్తుకు తగిన బరువు లేని 2.5 కోట్ల మంది బాలలకు భారత్ నిలయంగా మారింది. 0-6 వయస్సు లోపు పిల్లలలో పెరుగుదల లోపాలను తగ్గించాల ని, మోదీ ప్రారంభించిన ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమం నామమాత్ర బడ్జెట్ కేటాయింపులతో కనీసం లక్ష్యాలను కూడా సాధించలేదు.
మరోవైపు, దేశంలో బహుళత్వ స్ఫూర్తికి బీజేపీ విఘాతం కలిగిస్తున్నది. ప్రజల మధ్య కుల, మత వైషమ్యాలు రెచ్చగొడుతున్నది. దేశాన్ని ఆర్థిక పరాధీన దిశకు తీసుకెళ్తున్నది. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రజల దృష్టిని భావోద్వేగ, యుద్ధకాంక్షల వైపు మళ్లిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు పౌర సమాజం కృషి చేయాలి. రాజ్యాంగ విలువల రక్షణ కోసం కలిసి నడవాలి. వనరులను, అవకాశాలను, అందరికీ సమానంగా వర్తింపజేసే రాజకీయ పాలనా విధానాల కోసం పోరాడాలి. రాజకీయ సంస్థలు, ప్రజాతంత్ర వాదు లు, దేశ భక్తులు ఈ చారిత్రక కర్తవ్యాన్ని చేపట్టాలి. దీనికి తెలంగాణ సారథ్యం వహించాలి.