దేశ ప్రజల సేవలో ‘ఎల్ఐసీ’ది సుదీర్ఘమైన విశ్వసనీయ చరిత్ర. ప్రజల పొదుపును చట్టబద్ధంగా సమీకరించి ఆ మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసం,ప్రభుత్వరంగ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నది. 1956 జనవరి 19న ఎల్ఐసీ దేశంలో అప్పటికే ఉన్న కొన్ని బీమా సంస్థల విలీనంతో ఏర్పడింది.జీవిత బీమా సంస్థగా దేశంలో ప్రజలకు సామాజిక భద్రత కల్పించటం కోసం ఇది ఉనికిలోకి వచ్చింది. నాటి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.5 కోట్లు వెచ్చించి ఎల్ఐసీని స్థాపించింది. ఇన్నేండ్లలో భారతీయులకు జీవితబీమా భరోసాను కల్పించిన సంస్థగా ఎల్ఐసీ ఎదిగింది. వటవృక్షం వంటి ఆ గొప్ప సంస్థను ఇప్పుడు నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అత్యంత ఖండనీయం.
దేశ ప్రభుత్వరంగ సంస్థల్లో రైల్వే తర్వాత రెండో అతిపెద్ద సంస్థ ఎల్ఐసీ. ప్రస్తుతం రూ.38 లక్షల కోట్ల స్థిర, చరాస్తులను కలిగి ఉన్నది. ఎల్ఐసీ తన లాభాలను డివిడెండ్ల రూపంలోనే రూ.28,605 కోట్లను సమకూర్చి ఆర్థికంగా కేంద్రానికి చేయూతనందించింది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ స్వర్ణోత్సవాల సందర్భంగా నాటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ‘ఒక ప్రభుత్వరంగసంస్థగా ప్రభుత్వం నుంచి సాయం పొందకుండా, అదే ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న సంస్థ ఎల్ఐసీ’ అని పొగిడారు.
ఎల్ఐసీ పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఎంతగానో సేవలందిస్తున్నది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) 2020-21 వార్షిక నివేదిక ప్రకారం.. లక్ష లోపు జనాభా కలిగిన పట్టణాల్లో సైతం ఎల్ఐసీ 1,844 శాఖలతో ప్రజలకు సేవలందిస్తున్నది. కానీ ప్రైవేట్ సంస్థలు మాత్రం పెద్ద నగరాలకే పరిమితమై పనిచేస్తున్నాయి. అవన్నీ పెద్ద పెద్ద నగరాల్లోనే 4,717 బ్రాంచీలను నెలకొల్పటం గమనార్హం. అలాగే 20 వేల లోపు జనాభా కలిగిన చిన్న పట్టణాల్లో ఎల్ఐసీ తన సేవలందించటానికి 1,037 శాఖలను ఏర్పాటు చేస్తే, అదే ప్రైవేటు సంస్థలు 107 మాత్రమే కలిగి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్ఐసీ సేవలు అందుతున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ పాలసీదారుల్లో 21.45 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే. మరోవైపు బీమా వ్యాపారంలో 23 ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు కూడా వీటిల్లో ఉన్నాయి. అయినప్ప టికీ మొత్తం పాలసీల్లో 75 శాతం వాటా ఎల్ఐసీదే. అంటే ఆ సంస్థపై ప్రజల నమ్మకం ఎంతటిదో తెలుస్తున్నది.
సామ్యవాద, అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా సామాజిక భద్రత కల్పించే పథకాలు మన దేశంలో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక భద్రతకు హామీ పడుతున్న ఒకే ఒక సంస్థగా ఎల్ఐసీని చెప్పుకోవచ్చు. సంస్థ లాభాల్లో 90 శాతానికి పైగా బోనస్గా పాలసీదారులకు చెల్లిస్తున్న సంస్థ ఎల్ఐసీ. లాభాలు పునాదిగా కాకుండా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో ఎల్ఐసీని అగ్రగామిగా పేర్కొనవచ్చు. ఎల్ఐసీ ఎంత సామాజిక బాధ్యతతో, లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నదంటే.. కేవలం రూ.330తో రూ.రెండులక్షల బీమా సౌకర్యాన్ని ‘ప్రధానమంత్రి జీవన బీమా యోజన పథకం’ ద్వారా కోట్లాది మందికి అందిస్తున్నది. ఆ కంపెనీ ఇలాంటి ఎన్నో ఇన్సూరెన్స్ పథకాలను నామ మాత్రం రుసుముతో అందిస్తున్నది.
బడ్జెట్ లోటును పూడ్చుకోవటం కోసం వనరులు సమకూర్చుకోవటానికే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. అయితే బ్యాంకులు, రైల్వేలు, విమానాశ్రయాలతో పాటు కీలకమైన వ్యూహాత్మక రంగాలైన రక్షణరంగాన్ని, ప్రజల జీవన భద్రతకు హామీ ఇస్తున్న ఎల్ఐసీని కూడా ప్రైవేటుకు కట్టబెట్టడం రాజ్యాంగ వ్యతిరేకం. ఆర్టికల్-12 ప్రకారం.. ఎల్ఐసీ రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వమే ఎల్ఐసీకి సంపూర్ణ రక్షణగా నిలవాలి. కానీ పాలసీదారుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయబూనటం బాధ్యతారాహిత్యం. ఎల్ఐసీ వంటి దిగ్గజ సంస్థను ప్రైవేటుపరం చేస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రైవేటు బీమా కంపెనీలు గత కొన్నేండ్ల కాలంలో దివాళా తీశాయి. దీనికి అమెరికా, యూరప్ దేశాల్లోని బీమా కంపెనీలనే ఉదాహరణలుగా చూడవచ్చు. 96 వేల మంది ఉద్యోగులతో 120 దేశాల్లో కార్యాలయాలు కలిగి ఉన్న అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఏఐజీ) 2008లో మూతపడింది. అమెరికా ప్రభుత్వం దాన్ని ఆదుకోవటానికి 20,500 కోట్ల డాలర్లను (రూ.15 లక్షల కోట్లకు సమానం) ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే పరిస్థితి మన దేశంలోని ఎల్ఐసీకి ఎదురైతే.. కోట్లాదిగా ఉన్న పాలసీదారులు ఏమైపోవాలి. రూ.75,000 కోట్ల బడ్జెట్ లోటును పూడ్చుకోవటానికి ఎల్ఐసీని కేంద్రం బలితీసుకోవటం సబబేనా?
మోదీ అధికారం చేపట్టిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మకాల జాతర కొనసాగిస్తున్నది. మొదట్లో నష్టాల్లో ఉండి ప్రభుత్వానికి భారంగా మారిన వాటినే ప్రైవేటుపరం చేస్తానన్న మోదీ, లాభాల్లో ఉన్నవాటిని కూడా తెగనమ్ముతున్నారు. ఎల్ఐసీ అనేది ఒక కంపెనీ కాదు. అది ఒక మానవీయ సంస్థ. కరోనా అంతటి సంక్షోభంలో ఆ కంపెనీ అందించిన సేవలు వెలకట్టలేనివి. ప్రజల ఆర్థిక, జీవనభద్రతకు హామీ పడుతున్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటం ప్రజావ్యతిరేకమే కాదు, ద్రోహపూరితం కూడా.
– ఎడిటోరియల్ డెస్క్