ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన ప్రస్తుత కాలంలో మనం ఎలాంటి సేవలు పొందాలన్నా ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నాం. అయితే ఆ సేవలు పొందే క్రమంలో వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని కొంత ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు తాము స్వీకరించిన డాటాను వ్యాపారానికి వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
వెబ్సైట్లలో పొందుపరిచిన వివరాలను తీసుకున్న సంబంధిత సంస్థలు దాన్ని ప్రకటన ఏజెన్సీలకు అమ్ముకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పటికే ఉన్న బిల్లు స్థానంలో ‘డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్-2022’ను ప్రభుత్వం తీసుకువచ్చింది. బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఈ బిల్లు రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకువస్తుంది. వ్యక్తులను అతడు లేదా ఆమె అని ఈ బిల్లు సంబోధించడం భారత శాసనచరిత్రలో ఇదే ప్రథమం.
బిల్లు ముసాయిదాను 2022 నవంబర్లో ఖరారు చేశారు. ఈ బిల్లు ప్రకారం… కేవలం చట్టంలో సూచించిన పద్ధతుల్లోనే డాటా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. డాటా దుర్వినియోగాన్ని నియంత్రించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. వ్యక్తిగత డాటాను ప్రాసెస్ చేయడానికి ముందు అతని లేదా ఆమె సమ్మతిని తీసుకోవాలి లేదా నిర్దిష్ట చట్టబద్ధమైన ఉపయోగాల కోసమే వ్యక్తిగత డాటాను ప్రాసెస్ చేయాలని చట్టం చెప్తున్నది. ఏ అవసరాల కోసం డాటా సేకరించారో ఆ లక్ష్యం కోసమే నిల్వ చేయాలని సూచిస్తున్నది. భారత్లో వ్యాపారాలు చేసే సంస్థలు విదేశాల్లో జరిపే డాటా ప్రాసెసింగ్కూ ఈ చట్టం వర్తిస్తుంది. ప్రైవేటు సంస్థల డాటా దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో తెచ్చిన ఈ బిల్లులో ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా వీటిని ఇచ్చారు. కానీ ప్రైవేటు సంస్థలకు మాత్రం ఎలాంటి మినహాయింపుల్లేవు. దీనివల్ల దేశంలో డాటా సెంటర్లు, ప్రాసెసింగ్ కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టడం కంపెనీలకు కష్టమవుతుందని అంతర్జాతీయ టెక్నాలజీ పరిశ్రమల మండలి ‘ఐటీఐ’ పేర్కొన్నది. ‘ఐటీఐ’లో గూగుల్, ట్విటర్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి బడా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఇచ్చిన మినహాయింపుల విషయానికి వస్తే ప్రత్యేక సందర్భాల్లో సమాచారాన్ని సేకరించడానికి గల కారణాలను ప్రభుత్వం వ్యక్తులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. శాంతిభద్రతల పేరిట ప్రభుత్వానికి ఇలా మినహాయింపులు ఇస్తూపోయారు. సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన పని లేదని చట్టం చెప్తుండటం గమనార్హం. ఈ మినహాయింపులు వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగించవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఈ అంశంపై తయారైన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఇది రెండేండ్లకు పైగా జేపీసీ పరిశీలనలో ఉన్నది. 2021 డిసెంబర్లో కమిటీ తన నివేదికను సమర్పించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు సవరణలు ప్రతిపాదించడంతో… సంబంధిత ఆందోళనలను పేర్కొంటూ కేంద్రం బిల్లును ఉపసంహరించుకున్నది. దాని స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఈ బిల్లు నాలుగు సార్లు మార్పులకు గురైంది. ‘వ్యక్తిగత గోప్యత అనేది ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కు’ అని సుప్రీంకోర్టు చెప్పింది. అప్పటినుంచి డాటా ప్రొటెక్షన్ చట్టం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ చట్టం కింద ప్రభుత్వం ‘డాటా ప్రొటెక్షన్ బోర్డును ఏర్పాటు చేస్తుంది. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఈ బోర్డు పరిష్కరిస్తుంది. దీనికి డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాగా నామకరణం చేయనున్నారు. డాటాను ప్రాసెస్ చేసే ఏజెన్సీలకు ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇచ్చింది. వీటిని ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం లేదు. అలాగే వినియోగదారుల నుంచి తీసుకున్న వ్యక్తిగత వివరాలను ఎక్కువకాలం సర్వర్లలో నిల్వ చేయరాదని, ఒకవేళ అలాచేసినా దాన్ని తొలగించడానికి గానీ, సవరించడానికి గానీ వినియోగదారులకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని పక్షంలో రూ.500 కోట్ల వరకు జరిమానా విధించేందుకు అవకాశం కల్పించనున్నది.
పెద్ద మొత్తంలో డాటాను ప్రాసెస్ చేసే కంపెనీలు ఒక డేటా ఆడిటర్ను నియమించుకోవాలి. ఈ నూతన చట్టం కింద వచ్చే ఫిర్యాదులను ఆ ఆడిటర్ పరిశీలించాల్సి ఉంటుంది. పిల్లల డాటాపై ఈ బిల్లులో మరింత కట్టుదిట్టమైన నిబంధనలున్నాయి. పిల్లలకు హాని కలిగించేలా వారి డాటాను ఎక్కడా వినియోగించకూడదు. వారిని లక్ష్యం చేస్తూ ఎక్కడా ప్రకటనలు ఇవ్వరాదు. పిల్లల పర్సనల్ డాటాను ప్రాసెస్ చేయడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి.
-ఎడిటోరియల్ డెస్క్