కోల్ కతా : బెంగాల్ యువకుడు పబరన్ బసు (20) ప్రపంచ ఫోటోగ్రఫీ సంస్థ అందించే ప్రతిష్టాత్మక యూత్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డును గెలుచుకున్న తొలి యువ భారతీయుడిగా కీర్తిపతాకను ఎగురవేశారు. కొల్ కతా కు చెందిన పబరన్ బసు కేవలం నాలుగేండ్ల వయసులోనే తన తండ్రి కెమెరాను క్లిక్ మనిపించి ఔరా అనిపించాడు. వీధి ఫోటోగ్రాఫర్ల ప్యారడైజ్ గా పేరొందిన ఉత్తర కోల్ కతాలో అతడి బాల్యమంతా ఫోటోగ్రాఫిక్ పరికరాల చుట్టూ గడిచింది.
వీటితో తాను ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తుంటే అప్పుడప్పుడూ తన తండ్రి చిన్నపాటి సలహాలు ఇస్తూ ఉండేవాడని పబరన్ బసు గుర్తుతెచ్చుకున్నాడు. కరోనా మహమ్మారి విరుచుకుపడి ప్రపంచం విస్తుపోతే బసు ఈ విపత్తు సమయాన్ని తన ఫోటోగ్రాఫిక్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాడు.
న్యూయార్క్ కు చెందిన మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ నుంచి ఆన్ లైన్ ఫోటోగ్రఫీ కోర్సు నేర్చుకున్నాడు. 14 ఏండ్ల నుంచి సోనీ అందిస్తున్న వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డుల్లో టైటిల్ ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా పబరన్ బసు చరిత్ర లిఖించాడు.
ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్లు హెన్రీ కార్టిర్ బ్రెసన్, స్టీవ్ మెకర్రీ, రఘు రాయ్ లను అభిమానించే పబరన్ తన ఫోటోగ్రఫీ ద్వారా ప్రపంచాన్ని చూపాలని ఉవ్విళ్లూరుతున్నాడు. రాబోయే రోజుల్లో మూవీ నిర్మాణంలోనూ అడుగుపెట్టాలన్నది అతడి కల. ప్రజల కథలు, కల్చర్ ను నిక్షిప్తం చేసేందుకు తాను ఇష్టపడతానని..పూర్తి నిజాయితీతో ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలన్నదే తన ఆశయమని పబరన్ చెబుతాడు.