Radhika Mangipudi | ‘ఆధ్యాత్మిక విలువలకు నెలవైన ప్రాచీన భారతీయ దర్శనంలోని తాత్త్విక ఆలోచనలు, తత్త్వశాస్త్ర సారం ఇతివృత్తంగా భారతీయతత్త్వ శతకం రచించినట్లు శతక కవయిత్రి రాధిక మంగిపూడి చెప్పారు. రాధిక మంగిపూడి రాసిన ‘భారతీయ తత్త్వ శతకము’ పుస్తకాన్ని ‘తటవర్తి గురుకులం’ ఆస్ట్రేలియా శాఖ ప్రచురించింది. ‘సింగపూర్ తెలుగు టీవీ’ వారి సాంకేతిక సహకారంతో ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ సందర్భంగా రాధిక మంగిపూడి మాట్లాడుతూ.. ‘ముందు మాట’ రూపంలో సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తన రచనను దీవించి ఆశీస్సులు అందించారన్నారు. తన పుస్తకాన్నికవి పండితులు డాక్టర్ మేడసాని మోహన్ వంటి పంచసహస్రావధాని ఆవిష్కరించడం తన పురాకృత పుణ్యం, భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నా’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, గురువులకు, నిర్వాహకులు, పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశీస్సులు అందజేశారు. ఇంకా గౌరవ అతిథులుగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ సినీకవి రచయిత భువనచంద్ర, కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి ఈ పుస్తక విశిష్టతను మెచ్చుకున్నారు. 18 రోజుల్లో ఈ శతకాన్ని పూర్తి చేసినందుకు రాధిక మండిపూడికి ఆశీస్సులు అందజేశారు.
పుస్తకావిష్కర్త, ముఖ్య అతిధి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ “మధువచోరూఢి రాధికా మంగిపూడి” అంటూ ఆశువుగా పద్య రూపంలో ఆమెకు ఆశీస్సులు అందించారు. తొలి పుస్తక ప్రతిని విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలోని అమ్మవారికి అర్పించారు. తద్వారా ఇంటర్నెట్లోనే అందరికీ అమ్మవారి దర్శనం కల్పించారు.
తటవర్తి గురుకులం అధ్యక్షులు తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ తమ గురుకులం నిర్వహిస్తున్న ‘కావ్య గురుదక్షిణ’ లో భాగంగా, రాధిక ఈ శతకాన్ని తాను చదువుకున్న విజయనగరం విద్యాసంస్థలకు, చిన్ననాటి గురువులకు అంకితం చేశారన్నారు. ఆ గురువుల సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ జరుగడం ఎంతో ప్రశంసనీయమన్నారు.
“శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్న కుమార్, అమెరికా నుండి శతకం డిజైనింగ్ చేసిన “స్వర మీడియా” సంస్థ అధ్యక్షులు యక్కలి రాజేష్, రాచకొండ శాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్త్వశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వానపల్లి వెంకట్రావు, ఆస్ట్రేలియా నుండి డాక్టర్ చింతలపాటి, న్యూజిలాండ్ నుండి తంగిరాల నాగలక్ష్మి, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, మలేషియా నుండి డాక్టర్ వెంకట ప్రతాప్, కాకినాడ నుండి డాక్టర్ దీక్షితులు, వివిధ దేశాల్లోని తెలుగు సాహిత్యాభిమానులు, రాధిక కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూజిలాండ్ నుండి సంగీత భారతి పాఠశాల అధ్యక్షులు మల్లెల గోవర్ధన్, వారి విద్యార్థినులు శతకంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. సింగపూర్ నుండి గుంటూరు వెంకటేష్ వ్యాఖ్యాతగా, గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ లింక్ ద్వారా https://www.youtube.com/watch?v=_WDL9LWZ-fU పూర్తి కార్యక్రమం చూడవచ్చు.