హైదరాబాద్ : భారతీయ ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరాలకు అందించాలనే సంకల్పంతో యూఎస్ఏ సిలికాన్ లోయలో ప్రతి ఏట వేసవి ప్రారంభంలో నిర్వహిస్తున్న ‘శివమూర్తుల వైభవం’ కార్యక్రమం ఆధ్యాంతం భక్తి మార్గంలో రంజింపజేసింది.
అమెరికాలో శాన్ హొసె (కాలిఫోర్నియా)లో శివపదచింతామణి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ దర్శించి, కూర్చిన శివపదం సంకీర్తనలు, కళాకారుల నృత్యాలను ప్రదర్శించారు. వాణి గుండ్లాపల్లి నిర్వహణలో 12 మంది గురువులు కూచిపూడి, భరతనాట్యం, మోహినీ అట్టం, కథక్, ఒడిసి రీతులతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. బిదిషా మొహంతీ (ఒడిసీ) , నైన శాస్త్రి, (భరతనాట్యం) , పెండేకంటి సునీత (కూచిపూడి) , రాజేష్ చావలి (కూచిపూడి), చందన వేటూరి (కూచిపూడి, భరతనాట్యం), భైరవి నెడుంగడి (మోహిని అట్టమ్), గణేశ్ వాసుదేవన్ (భరత నాట్యం), అఖిల రావు (భరతనాట్యం), దీపాన్విత సేన్ గుప్త (కథక్), సీమ చక్రబర్తి , సుప్రియ సుధాకర్, నూతి ప్రసూన (కూచిపూడి ) వారి శిష్యబృందం చేసిన నృత్యాలు భక్తిభావాన్ని పెంచింది.
భారత ప్రభుత్వ కన్సులేట్ జనరల్ (శాన్ ఫ్రాన్సిస్కో) డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కళాకారులు అద్భుత నృత్యాలతో బే ఏరియా(Bay Area) శివమయం అయిందని పేర్కొన్నారు. కంబోడియాలోని ఖ్మేర్ తమిళ సంఘం ప్రతినిధి డాక్టర్ రామేశ్వరాన్ని,దెందుకూరి రఘునాథ్ను ఈ సందర్భంగా సన్మానించారు. కాలిఫోర్నియా ప్రభుత్వ ప్రతినిధి పంపిన అభినందన పత్రాన్ని షణ్ముఖ శర్మకు అందజేశారు.