హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓయూ, జేఎన్టీయూహెచ్, కాకతీయ వంటి అన్ని రకాల యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉన్నత విద్యాధికారులు, యూనివర్సిటీ అధికారులను ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,774 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అధికంగా ఓయూలో 2,075 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్ టెక్నికల్లో జూనియర్ అసిస్టెంట్లు, ఆ పై క్యాటగిరీ పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో ఓయూ పరిధిలో 680 పైగా జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి చాన్స్ ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. జేఎన్టీయూహెచ్లో 115, కాకతీయలో 174 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.