భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సందర్భంలో కామారెడ్డి ప్రాంతానికి చెందిన వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డి ప్రాంతం నిజాం సంస్థానం పరిధిలోని హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ఉన్న సందర్భంగా భారతదేశంలో కలిసేలా పోరాటాలు నిర్వహించారు.
హైదరాబాద్ పరిధిలో కామారెడ్డి ప్రాంతం ఉండగా సర్దార్ పటేల్ నేతృత్వంలో నిర్వహించిన పోరుబాటకు తలొగ్గి ఇండియన్ యూనియన్లో విలీనం కావడంతో ఈ ప్రాంతానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభించింది. కామారెడ్డి, పెద్దమల్లారెడ్డి, భిక్కనూర్, ఎర్రపహాడ్, దోమకొండ, బీబీపేట, ఆర్గొండ తదితర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు.
– కామారెడ్డి, ఆగస్టు 13
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో 1946 ని జాం పాలనలో ఉండగా, రాజకీయ అలజడులు కొనసాగుతున్నాయి. భూ సంస్కరణల పేరుతో కామారెడ్డి ప్రాంతంలో కొండా వెంకటరంగారెడ్డి, బుర్గుల రామకృష్ణారావు, జమాలాపురం కేశవరావు, మందమల నర్సింగరావు, వినాయకరావు తదితరులు ఈ ప్రాం తంలో పర్యటించి ప్రజల్లో స్వాతంత్య్రాభిలాషను మేల్కొలిపే కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే బ్రిటి ష్ పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు క్విట్ ఇండి యా ఉద్యమం వంటి ముమ్మర పోరాటాల ప్రభావం కనిపించింది.
నిజాం ప్రభుత్వం స్టేట్ కాంగ్రెస్పై విధించిన గస్తీ-53 నిషేధాజ్ఞను 1946 జూలై 3న ఎత్తివేయగా అదే సమయంలో కామారెడ్డికి చెందిన జీడిపల్లి విఠల్ రెడ్డితోపాటు పలువురు స్టేట్ కాంగ్రెస్లో చేరారు. 1945నుంచి 1947 వరకు కాంగ్రెస్వాదులు స్వాతంత్య్ర కార్యక్రమాలు విరివిగా నిర్వహించారు. ఆగస్టు 7, 1947 నాడు ఇండియన్ యూ నియన్ డేగా ప్రకటించగా, ఆగస్టు 15న స్వాతం త్య్రం ప్రకటించడంతో జాతీయ జెండాలు ఎగరవేయాల్సి ఉండగా నిజాం యూనియన్ నిషేధించింది. నిషేధాజ్ఞను ఉల్లంఘించిన వారందరినీ అరెస్టు చేశారు.
1946లో భారతదేశానికి స్వాతంత్య్రం దిశగా అడుగులు పడుతుండగా, నిజాం రాజ్యం ప్రత్యేక దేశంగా ఉండేందుకు ప్రయత్నాలు జరిగాయి. రజాకార్ల దళాధిపతిగా ఖాసీం రజ్వీ ఉండడంతో జిన్నా అండతో నిజాం పాలనతో ఉస్మానిస్థాన్అనే ఇస్లామిక్ దేశంగా సన్నాహాలు జరిగాయి. రజాకార్లు నిజాం పోలీసులతో కలిసి హిందువులను ముస్లిములుగా మార్చేందుకు కుట్ర జరిగింది. 1947జూన్లో దేశంలో మౌంట్ బాటెన్ పర్యటించి స్వాతంత్య్ర ముహూర్తం ఖరారు చేసి వివిధ సంస్థానాలను విలీనం కావాలని ప్రకటించగా నిజాం, జునాఘడ్, కశ్మీర్ తప్ప మిగితావి భారత యూనియన్లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తంచేశాయి. ఇదే సమయంలో నిజాం ప్రభుత్వం భారత ద్రవ్య చలామణిని నిషేధించింది.
ఆగస్టు 15, 1947లో జాతీయ పతాకావిష్కరణ జరిగింది. ఈ ప్రాంత వాసులు భారతదేశంలో కలుస్తామా లేదా అనే అనుమానాలు వ్యక్తంచేశారు. నిజాం పాలనలో జరుగుతున్న ఆరాచకాలను చూసి భారత ప్రభుత్వం కేఎం మున్షీ నివేదిక ఆధారంగా ఆపరేషన్ పోలో యాక్షన్ను ప్రారంభించారు. నలువైపుల నుంచి సర్దార్ పటేల్ యాక్షన్ చేపట్టారు. మొదట విజయవాడ మీదుగా జేఎన్ చౌదరి నాయకత్వంలో సెప్టెంబర్ 13, 1948న హైదరాబాద్కు సైన్యం చేరుకున్నది. ఔరంగాబాద్ మీదుగా మరో బృందం సెప్టెంబర్ 16న నిజామాబాద్ ప్రాంతాన్ని వశపరుచుకున్నది. భారత సైన్యం విజయం దిశగా వెళ్తుండడాన్ని గమనించి నిజాం సైన్యాధిపతి ఎల్ ఎడ్రుస్ సెప్టెంబర్ 17న కేఎం మున్షీ ఎదుట లొంగిపోయారు. దీంతో మీర్ ఉస్మాన్ అలీఖాన్ రేడియోలో తన ప్రసంగాన్ని అందించి భారతదేశంలో విలీనం ప్రకటించారు.
నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్వాదులు గ్రామాల్లో ఉద్యమాలు ప్రారంభించగా, వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. 1947 ఆగస్టు 29న ధాన్యం కోసం భిక్కనూర్లోని గోదాంను లూటీ చేయగా, ఈ ఘటనలో భిక్కనూర్ నారాయణ రెడ్డి, రామన్న గుప్తా, బుర్ల విశ్వనాథం, కాంతం రాంచంద్రయ్య, రామవ్వ, నారాయణ, పెంటయ్య, జొన్నల ఇస్తారు తదితర 100 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రైతులకు అండగా విఠల్ రెడ్డి ఉచితంగా వాదించేందుకు అంగీకరించగా అప్పటి పోలీస్ పటేల్ నజీర్ అహ్మద్ అడ్డుకునే ప్రయత్నంతోపాటు అరెస్టు చేసే కుట్ర చేశారు.
ఆగస్టు 30, 1947 రోజున జీడిపల్లి విఠల్ రెడ్డి, అడ్వకేట్ లక్ష్మణ రావు, డా.వెంకటేశ్వర్ రావు, పెద్ద నారాయణరెడ్డి, సిద్దిపురపు విశ్వేశ్వరరావులతోపాటు సుమారు 40మందిపై కానున్ తహపుజ్ అమన్ ముమాలిక్ మోహరుసా సర్కార్ అలీ చట్టంకింద నేరాలు మోపి వివిధ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. భిక్కనూర్ నారాయణరెడ్డితోపాటు ఆయన మేనమామ పెద్ద నారాయణరెడ్డిపై రాష్ట్రంలో వ్యతిరేకశక్తులుగా ముద్రవేసి అరెస్ట్ చేశారు. జైలులో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నారనే సాకుతో జీడిపల్లి విఠల్ రెడ్డి, చౌట్పల్లి హన్మంత్ రెడ్డి, నల్ల రుక్మారెడ్డి, పెట్రోల్ పంపు ప్రతాప్ రెడ్డి, వకీల్ నారాయణ రెడ్డి, బోర్డింగ్ రాంచంద్రారెడ్డిలను నిజామాబాద్ ఖిల్లా నుంచి ఔరంగాబాద్ జైలుకు తరలించారు.