భీమ్గల్, జూలై 27: పట్టణ ప్రజల చిరకాల కల నెరవేరింది. ఎట్టకేలకు కోర్టు ఏర్పాటుకాగా, ఈ నెల 26న ప్రారంభమైంది. 15 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు స్థానికంగా కోర్టు ఏర్పాటు చేయాలని సందర్భం వచ్చిన ప్రతిసారీ వివిధ వేదికలపై డిమాండ్ చేస్తూ వచ్చారు. గతంలో ఒకసారి కోర్టు మంజూరైనప్పటికీ అది ఆర్మూర్ కోర్టులోనే భీమ్గల్ పేరుపై కొనసాగుతున్నది. దీంతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరలేదు. అప్పటి నుంచి ఈ ప్రాంతవాసులు నిరాశతో ఉన్నారు. పాతికేండ్ల క్రితమే ఇక్కడికి రావాల్సిన ప్రభుత్వ దవాఖాన కూడా ధర్పల్లికి తరలిపోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానికంగా బలమైన నాయకులు లేకనే అభివృద్ధికి ఆమడ దూరంలో భీమ్గల్ నిలుస్తున్నదని ఇక్కడి ప్రజలు భావిస్తూ వచ్చారు. దీన్ని తరచూ వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తం చేశారు.
ఇటీవల సోషల్ మీటియా వాడకం విస్తృతం కావడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. దీనికి తోడు ఇటీవల ఈ ప్రాంతానికి కోర్టు మంజూరు కాగా, ఇక్కడ సౌకర్యాలు లేవన్న కారణంగా మోర్తాడ్కు తరలిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో స్థానికంగా ఒక రకంగా చిన్నపాటి ఉద్యమమే మొదలైంది. దీంతో ఒత్తిడి పెరగడంతో స్థానిక నాయకుల్లో కదలిక వచ్చి ముందుకెళ్లారు.
గతేడాది సెప్టెంబర్లో హైకోర్టు జడ్జిగా స్థానికుడైన గాడి ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇక్కడ కోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్థానికంగా జన్మించి, చదువుకున్న ప్రవీణ్ కుమార్ భీమ్గల్లో కోర్టు ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేశారు. స్థానికులు ఆయన వద్దకు వెళ్లి ఇక్కడ కోర్టు ఆవశ్యకతను వివరించడంలో సఫలీకృతులయ్యారు. ఆయన పట్టుబట్టి కోర్టు ఏర్పాటయ్యేంత వరకూ విశ్రమించలేదు.
ఎట్టకేలకు భీమ్గల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటైంది. ఇదే ఈ విషయాన్ని ఆదివారం కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన హైకోర్టు జడ్జి జస్టిస్ తంగిరాల మాధవీ దేవి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. స్థానికుడైన జడ్జి గాడి ప్రవీణ్ కుమార్ కృషితోనే కోర్టు ఏర్పాటు సాధ్యపడిందని తెలిపారు. ఆయన కృషిని స్థానికులు కొనియాడుతున్నారు.