ఏ పాఠశాలలోనైనా విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. ఈ బడిలో మాత్రం చాలా వరకు బొమ్మలే పాఠాలు చెబుతాయి. లెక్కలు, ఎక్కాలు నేర్పిస్తాయి. జాతీయ నాయకులు, ప్రముఖుల గొప్పదనం గురించి వివరిస్తాయి. వివిధ వస్తువులు, పరికరాలు, జంతువులు, ప్లానెట్, ప్రకృతి, పరిసరాలు, పర్యావరణం గురించి తెలియజేస్తాయి. దీంతో విద్యార్థులు ఎంచక్కా బొమ్మలు చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని అన్నారం ప్రాథమిక పాఠశాల ఇది..
Annaram primary school | బీర్కూర్, ఏప్రిల్ 12: సమయానికి పాఠశాలకు వచ్చామా? విద్యార్థులకు పాఠాలు బోధించామా? వెళ్లామా? అని ఈ ఉపాధ్యాయులు ఆలోచించలేదు. తాము విధులు నిర్వర్తిస్తున్న పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని బాగుచేద్దామని వినూత్న ఆలోచన చేశారు. తమ ఆలోచనను సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లి ఆచరణలో పెట్టారు. దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారు. వారే బీర్కూర్ మండలంలోని అన్నారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని సరస్వతి, ఉపాధ్యాయురాలు గీత. ఈ పాఠశాలను 1964 సంవత్సరంలో నిర్మించారు.
1-5 వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో వానకాలంలో విద్యార్థుల సమస్యలు వర్ణణాతీతం. సమస్యను పాఠశాల ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయురాలు సరస్వతి, గీత సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు తమవంతు సాయంగా తమ జీతం నుంచి రూ.10వేల చొప్పున, మొదటగా రూ.20 వేలు వారే విరాళాన్ని అందజేశారు. దానికి తోడు సర్పంచ్ కృష్ణారెడ్డి రూ.40వేలు, మాజీ సర్పంచ్ లత భర్త రమేశ్ ప్రత్యేక చొరవ తీసుకుని యూత్ సభ్యులు, దాతలు అందరూ కలిసి రూ.1.40 లక్షలు జమచేసి పాఠశాల రూపురేఖలు మార్చారు. దాతల విరాళాల విషయం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి వెళ్లడంతో తక్షణమే ఆయన రూ.2లక్షలు మంజూరు చేయించారు.
శిథిలావస్థలో ఉన్న గదులతోపాటు వంటగది, మరుగుదొడ్లను మొదటగా మరమ్మతు చేయించారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా అన్ని గదులకు ఆకర్షణీయమైన రంగులు వేయించడంతోపాటు గోడలపై విద్యకు సంబంధించిన చిత్రాలను గీయించారు. దీంతో కొత్త కళను సంతరించుకున్నది. వంటగదిలో ఆహారపట్టిక, ప్రధానోపాధ్యాయురాలు గదిలో ముఖ్య దినోత్సవాలు, శుభ్రత విషయాలు విద్యార్థులకు అర్థమయ్యేలా రంగులతో రాయించారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఆంగ్ల గేయాలు, అక్షరాలు, అచ్చులు, వర్ణమాల, స్పష్టమైన తెలుగు పదాలు, చెట్లు, పక్షులు, జంతువులు, కూరగాయలు, జాతీయ, రాష్ట్ర చిహ్నాలు, దంత నిర్మాణం, కుటుంబ సంబంధాల పేర్లు, మంచి అలవాట్లు, జాతీయ నాయకుల ఫొటోలు తదితర చిత్రాలు వేయించారు. ఈ చిత్రాలతోనే విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు.
ప్రైవేటుకు దీటుగా..
మేము నిరుపేద కుటుంబం నుంచే వచ్చి నేడు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నాం. మేము బోధిస్తున్న పాఠశాల శిథిలావస్థలో ఉండడంతో మొదటగా రూ.20వేలు విరాళం అందజేసి సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేయించారు. చాలా సంతోషంగా ఉం ది. ప్రైవేటు పాఠశాల మాదిరిగా రంగురంగుల చిత్రాలతో పాఠశాల కళకళలాడడంతో ప్రజల మన్ననలు పొందడం సంతోషంగా ఉన్నది.
-సరస్వతి, ప్రధానోపాధ్యాయిని, గీత ఉపాధ్యాయురాలు
స్పీకర్కు కృతజ్ఞతలు
మేము విరాళాలు వేసుకున్న విషయం సభాపతి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తక్షణమే రూ.2 లక్షలు మంజూరు చేశారు. ఈ డబ్బులతో పాఠశాలలో టైల్స్, ఆధునిక హంగులతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్నాం. గ్రామ ప్రజల తరఫున స్పీకర్కు కృతజ్ఞతలు.
-కిష్టారెడ్డి, సర్పంచ్, అన్నారం