Prajavani | కంటేశ్వర్, ఆగస్టు 11 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా స్థాయి అధికారులు డుమ్మా కొట్టడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజావాణిలో 83 ఫిర్యాదులు అందగా సంబంధిత శాఖ అధికారులను ఫిర్యాదులు పరిశీలించి త్వరితగతన సమస్యను తీర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు రాకపోవడం గమనించిన కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాముఖ్యతను అధికారులు గుర్తించాలని ఎంతో ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమానికి కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించవద్దని, జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రతీ సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లా అధికారులు కచ్చితంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని, ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఉంటే ముందుగానే తెలియజేయాలని సూచించారు.
అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్వాజరు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.