మాక్లూర్, జనవరి 8: మండలంలోని కల్లడి గ్రామానికి చెందిన బండారి హర్షవర్ధన్ (5) కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కల్లడికి చెందిన బండారి మధు- రజని దంపతులకు ఇద్దరు కుమారులు హర్షవర్ధన్, బిట్టు ఉన్నారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్ తన తాత ధర్మయ్యతో కలిసి డిసెంబర్ 25న పంట పొలాలకు వెళ్లి ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేశాయి. దీంతో హర్షవర్ధన్కు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.
మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వాంతులు చేసుకోవడంతో ఆదివారం మళ్లీ దవాఖానకు తీసుకెళ్లగా.. వైద్యులు హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హర్షవర్ధన్ను రాజధానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుప్రాన్ వద్ద వాంతులు చేసుకున్నాడని, హైదరాబాద్కు చేరుకోకముందే మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.