ఓ వైపు ఎన్నికల వేడి కొనసాగుతుండగానే మరోవైపు ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లలోనూ క్రికెట్ ఫీవర్తో ఊగిపోతున్నారు. మరోవైపు ఐపీఎల్ పేరిట బెట్టింగ్ జోరందుకున్నది. చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. ప్రధానంగా యువకులు బెట్టింగ్కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించవచ్చనే అత్యాశతో సర్వం కోల్పోతున్నారు. క్రికెట్ ప్రేమికుల వ్యసనాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకొని బెట్టింగ్ ముఠాలు తమ బుట్టలో వేసుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో రంగంలోకి దిగిన పలు ముఠాలు ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలిసింది.
లాడ్జీలు, గెస్ట్హౌస్లు, దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు క్రికెట్ బెట్టింగ్కు అడ్డాగా మారాయి. యువతను ఆకర్షించేలా వ్యాపార సముదాయాల్లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని అదనుగా చేసుకొని బెట్టింగ్రాయుళ్లు అక్కడే తిష్టవేసి క్రికెట్ జూదం నడుపుతున్నారు.
క్రికెట్ బెట్టింగ్లో ప్రధాన బుకీలు తమకు అనువుగా ఉండే వారిని ఏజెంట్లుగా పెట్టుకొని వారిని జిల్లాలోని అన్ని మండలాలకు పంపుతున్నారు. స్థానిక యువతకు దగ్గరగా ఉంటూ వారి ద్వారా తమ బెట్టింగ్ జూదాన్ని జోరుగా సాగిస్తున్నారు.ప్రస్తుతం డబ్బుల చెల్లింపు మొత్తం ఆన్లైన్ ద్వారానే సాగుతుండడంతో యువత ఈజీగా బెట్టింగ్లో సభ్యులుగా చేరిపోతున్నారు.
క్రికెట్ బెట్టింగ్లో రూపాయికి వంద రూపాయులు వస్తాయని తెలియడంతో నిత్యం వందలాది మంది యువత లక్షల్లో బెట్టింగ్ కడుతున్నారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర ఏరియాలకు చెందిన ప్రధాన బుకీలు తమకు ఉన్న ఏజెంట్స్ ద్వారా బెట్టింగ్ దందా జోరుగా సాగిస్తున్నారు. ఒక్కో మ్యాచ్ ముగిసేసరికి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. జోష్లో ఉన్న యువత బెట్టింగ్లో డబ్బులు పెడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. డబ్బులు రావడం దేవుడెరుగు చాలా మంది యువత అప్పులపాలవుతూ ఇంట్లో చెప్పుకోలేక మదన పడుతున్నారు.
గతంలో ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కాగానే బెట్టింగ్ ఆడేవారిపై పోలీసులు నిఘా పెట్టేవారు. ఐడీ పార్టీ, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, టౌన్ ఐడీ పార్టీ టీమ్స్ పేరిట ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు క్రికెట్ బెట్టింగ్ ఏజెంట్స్తోపాటు బెట్టింగ్రాయుళ్ల పై నిఘా పెట్టి దాడులు చేసేవారు. నిర్వాహకుల నుంచి లక్షల నగదుతోపాటు సెల్ఫోన్స్ సీజ్ చేసి కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు బెట్టింగ్ బుకీలు, ఏజెంట్లు, బెట్టింగ్ రాయుళ్లను పట్టుకున్నదాఖలాలు లేవు. బెట్టింగ్ జరిగే విషయం పోలీసులకు తెలియడం లేదా లేక తెలిసినా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారా అనే బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, పోలీసుల్లో కొందరి అండ ఉండడంతో బుకీలు మూడు సిక్సర్లు, నాలుగు వికెట్ల చందంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ రెచ్చిపోతున్నారు. ఈ సీజన్లో నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు బుకీలు తమ కార్యకలాపాల జోరు పెంచారు.
అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సైతం బెట్టింగ్రాయుళ్లు ఉపయోగిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే బుకీలు లావాదేవీలు మొత్తం ఆన్లైన్ ద్వారానే జరుపుతున్నారు. దీంతో బెట్టింగ్ ఆడే యువకులు సైతం ముందస్తుగానే ఫోన్ పే, గూగుల్ పే తదితర ఆన్లైన్ మార్గంలోనే డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో క్రికెట్ జూదంపై ఎవరికీ అనుమానం రాకుండా మూడు ఫోర్లు.. ఆరు సిక్సర్లలా సాగుతున్నది.