బ్యాంకు లావాదేవీలు, రైల్వే టికెట్ల బుకింగ్, ఈ కామర్స్, ఆధార్ వెరిఫికేషన్ ఇలా చాలా వాటికి ఓటీపీలు అవసరం. మన మొబైల్కి వచ్చిన వన్ టైం పాస్వర్డ్ను ఎంటర్ చేస్తేనే మన లావాదేవీ పూర్తవుతుంది. కానీ రెండు రోజులుగా చాలామందికి ఓటీపీలు రావడం లేదు. మరికొంతమందికి ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో లావాదేవీలు పూర్తి చేసేందుకు వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా ఉన్నట్టుండి ఓటీపీ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడానికి టెల్కోలు కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనలే కారణమని తెలుస్తుంది.
ఓటీపీల మోసాలను అరికట్టేందుకు డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ప్లాట్ఫాం(డీఎల్టీ)ని అమలు చేయాలని టెలికాం కంపెనీలను టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) 2018 నుంచే సూచిస్తోంది. కాకపోతే దీనికి టెలికం సంస్థలు ముందుకు రాలేదు. ఈ క్రమంలో ట్రాయ్ ఆదేశాల మేరకు సోమవారం(మార్చి 8న) డీఎల్టీని అమల్లోకి తీసుకొచ్చాయి. అయితే ఈ నిబంధనల అమలు తర్వాత ఓటీపీ వ్యవస్థలో గందరగోళం నెలకొంది. కొత్త నిబంధనల అమలు కారణంగా సోమవారం సాయంత్రం దాదాపు 40 శాతం ఎస్ఎంఎస్లు నిలిచిపోయాయి. మంగళవారం పరిస్థితి కొంత మెరుగుపడ్డప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. అయితే దీనిపై టెలికం సంస్థలు, పేమేంట్ సహా ఇతర సంస్థలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కొత్త నిబంధనలను అమలు చేసే ప్రక్రియలో పేమెంట్ సంస్థలు చేసిన తప్పిదమే అంతరాయానికి కారణమని టెల్కోలు తెలిపాయి. మెసేజ్లు పంపేవారి ఐడీలను కొత్తగా తీసుకొచ్చిన బ్లాక్ చైన్ ప్లాట్ఫాంపై రిజిస్టర్ చేయకపోవడం వల్లే సందేశాలు వెళ్లలేదని పేర్కొన్నాయి. అయితే టెల్కోల తప్పిదం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేమెంట్ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీలు, బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ కంపెనీలు, గవర్నమెంట్ ఏజెన్సీలు, టెలీమార్కెటింగ్ కంపెనీలు డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ప్లాట్ఫాం(డీఎల్టీ) ద్వారా టెలికం ఆపరేటర్లతో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత వినియోగదారుడి మొబైల్కి వచ్చే ప్రతి మెసేజ్కు సంబంధించి టెలీ మార్కెటింగ్ సంస్థలు .. టెలికం కంపెనీలకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే టెలికం కంపెనీలు ట్రాయ్కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం బ్లాక్ చైన్ సాంకేతికతను అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మెసేజింగ్ టెంప్లేట్స్ ద్వారా వినియోగదారులకు సందేశాలను పంపిస్తారు. ఇందులో రిజిస్టర్ అయిన ఐడీల నుంచి వచ్చే మెసేజ్లను మాత్రమే ధ్రువీకరించుకుని వినియోగదారుడికి పంపిస్తారు. రిజిస్టర్ కానీ ఐడీల నుంచి వచ్చే సందేశాలన్ని ఆపేస్తారు.