ఒక్క రెండు నెలలు ఆగితే ఆమె జీవితమే మారిపోయేది. కానీ, రెండు క్షణాలలోనే జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది. రాకాసి ట్రక్కు ఇంట్లోకి దూసుకొచ్చింది.ఆమెను అచేతనురాలిని చేసింది. అప్పటినుంచి మంచానికే పరిమితమైపోయింది.అయినా శరీరానికి పరిమితులు కానీ, సంకల్పానికి హద్దులేమిటి? ఆ మనోబలం తోనే ఫ్యాషన్ డిజైనర్, ట్యూషన్ టీచర్, బీమా ఏజెంట్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, ఆర్టిస్ట్.. చేయగలనని అనుకున్న ప్రతి పనీ చేసింది. త్వరలోనే ఓ ఎన్జీవో, యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభిస్తానని చెబుతున్నది ఏ దశలోనూ ఆత్మన్యూనత ఛాయలు సోకని.. ఛాయాదేవి.
ఏప్రిల్ 5, 1999.
హైదరాబాద్.
బోరబండలోని రామారావునగర్.
ప్రధాన రహదారి పకనే ఓ ఇల్లు. ఏడు నెలల గర్భిణి ఛాయాదేవి ఆ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నది. కడుపులో బిడ్డ కదలికలకు మురిసిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నది. అప్పటికి ఆమె వయసు ఇరవై ఒకటి. ప్రేమించి పెండ్లి చేసుకున్నది. ఎందుకో ఆ క్షణంలో తన బాల్యం గుర్తు కొచ్చింది. పసిబిడ్డగా తన ఆటపాటలు గుర్తుకొచ్చాయి. ఆ రోజు వరకూ తాను ఒకరి బిడ్డ. త్వరలోనే ఓ బిడ్డకు తానే తల్లి! ఆ ఆనందం, ఆ పరవశం చూసి విధికి కన్నుకుట్టినట్టుంది. ఆ కలల్ని ఛిద్రం చేయమంటూ… రాకాసి శకటాన్ని పురిగొల్పింది. దాదాపు రెండువేల సిమెంట్ సంచులతో వెళ్తున్న 14 చక్రాల కంటెయినర్ ట్రకు అదుపు తప్పి ఒకసారిగా ఇంట్లోకి దూసుకొచ్చింది. ఆ ప్రమాదంలో ఛాయాదేవి తీవ్రంగా గాయపడింది. వెన్నెముక విరిగిపోయింది. తల్లి, చెల్లి కూడా గాయాలపాలయ్యారు. ఇకనుంచి ఛాయాదేవి నడవలేదు. తనంతటతాను కూర్చోలేదు. నడుము కింది భాగమంతా చచ్చుబడింది. స్పర్శ పూర్తిగా చచ్చిపోయింది. సగానికి సగం శరీరం.. నియంత్రణలో ఉండదిక. ఆమె సగం సజీవి.. సగం నిర్జీవి!
నిస్పృహ నుంచి..
దురదృష్టంలో అదృష్టం.. ఛాయాదేవి పొట్టలోని బిడ్డ మాత్రం సురక్షితంగా ఉంది. అమ్మ ప్రేమ ఆ పసిగుడ్డుకు రక్షణ కవచమై నిలిచిందేమో! కానీ కన్న కొడుకును చేతుల్లోకి తీసుకోలేని పరిస్థితి. తన మీద తనకే జాలి కలిగింది. తన బతుకుపట్ల తనకే వైరాగ్యం పుట్టింది. ఆ సంక్షోభ సమయంలో అండగా ఉండాల్సిన అత్తామామలు అవిటి కోడలు మాకొద్దని అనేశారు. బంధుమిత్రుల సానుభూతి వచనాలు గుండెకు తూట్లు పొడిచాయి. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడి వేధించాయి. ఈ సమస్యకు.. బలమైన లక్ష్యమే తిరుగులేని చికిత్స అని భావించిందామె. ఆ రోజునుంచీ మంచమే ఆమె కార్యాలయంగా మారింది. ఛాయాదేవి ఆంత్రప్రెన్యూర్ అవతారం ఆరంభమైంది. చదువుకునే రోజుల్లో తల్లి దగ్గర కుట్టుపని నేర్చుకున్నది ఛాయ. అప్పట్లో తన బట్టలు తానే కుట్టుకునేది. ఓ దశలో ఫ్యాషన్ డిజైనర్ కావాలనీ కలలుగన్నది. ఆ అనుభవం ఇప్పుడు పనికొచ్చింది. ఓ నాన్-పెడల్ కుట్టు మిషన్ తెచ్చుకుంది. కొద్దిరోజులకే టైలరింగ్ వ్యాపారం ఊపందుకుంది. పెండ్లికి ముందు టీచర్గా పనిచేసిన అనుభవంతో ట్యూషన్లు కూడా ప్రారంభించింది. ఈ ఇరవై రెండేండ్లలో ఛాయాదేవి జీవితంలో ఎన్నో మార్పులు.
అనేక రంగాల్లో..
తనిప్పుడు బీమా ఏజెంట్. ఎంతోమందికి జీవిత బీమా అవసరాన్ని గుర్తుచేసింది. ఛాయాదేవికి మొక్కలంటే ప్రాణం. ఆ మమకారం కొద్దీ ఇంట్లోనే చిన్న నర్సరీ ప్రారంభించింది. ఆమె ఇల్లు నందనవనంలా ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనమే. మూడొందలకు పైగా మొకలు రంగురంగుల కుండీల్లో దర్శనమిస్తాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఆమె కస్టమర్లలో ప్రవాస భారతీయులూ ఉన్నారు. మార్కెట్ పరిస్థితులను బట్టి, నెలకు సగటున లక్ష రూపాయలు సంపాదిస్తుంది.
అనుకూలంగా మార్చుకుని..
నిత్యం మంచానికే పరిమితం కావడం వల్ల.. ఛాయాదేవి శరీర కదలికలు తగ్గిపోయాయి. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. మధుమేహం దాడి చేసింది. ఊబకాయ సమస్యలూ వచ్చాయి. ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందని బలంగా నమ్ముతుంది ఛాయాదేవి. ఉన్నచోటే వ్యాయామం ప్రారంభించింది. ఆ ఆత్మవిశ్వాసానికి తలవంచి క్రమంగా క్యాలరీలు కరిగిపోసాగాయి. అలా రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గింది. అంతలోనే మరో కుదుపు. గత ఏడాది ఆమె భర్త మరణించారు. ఇక మిగిలింది.. ఒక్కగానొక్క బిడ్డ. కొడుకును హోటల్ మేనేజ్మెంట్ చదివిస్తున్నది. ఆమె ఓ మంచి చిత్రకారిణి కూడా. చాలా బొమ్మలు వేసింది. ‘అన్నీ అనుకూలిస్తే.. ఓ ఎన్జీవో ప్రారంభించాలన్నది నా ఆలోచన. చిన్నకష్టానికే, ఒకట్రెండు గాయాలకే కుదేలైపోతున్న జీవితాల్లో వెలుగు నింపాలన్నది నా ఉద్దేశం. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను చేరడానికి ఓ యూట్యూబ్ చానల్ ఆరంభించాలన్నది నా కోరిక..’ అంటున్నప్పుడు ఛాయాదేవి స్వరంలో సడలని సంకల్పబలం. అదే ఆమెకు దేవుడిచ్చిన వరం.