Toxic | ప్రముఖ నటుడు యష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆగస్టు 26న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇండస్ట్రీ నివేదిక ప్రకారం ఈ చిత్రం దేశవ్యాప్తంగా బ్లాక్ చేయబడిన సీట్లతో కలిపి రూ. 27 కోట్ల మార్క్ను దాటేసింది. కేవలం ఐదు భాషల్లోనే ఇప్పటివరకు 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం బ్లాక్ చేసిన సీట్లను మినహాయించినా కూడా అడ్వాన్స్ గ్రాస్ రూ. 18 కోట్లకు పైగా ఉండటం విశేషం.
ఈ పాన్-ఇండియా చిత్రానికి కర్ణాటకలో భారీ స్పందన లభిస్తోంది. ఒక్క కర్ణాటకలోనే రూ. 14.2 కోట్ల కలెక్షన్లు రాగా, మహారాష్ట్రలో రూ. 2.44 కోట్లు, గుజరాత్లో రూ. 1.74 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా రూ. 8.89 కోట్లు వసూలు కాగా, మైసూర్, కలబురగి తదితర ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. కన్నడ 2D వర్షన్తో పాటు హిందీ 2D, హిందీ ఐమ్యాక్స్ వెర్షన్లకు కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది.
గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ (A) సర్టిఫికేట్ జారీ చేసింది. యష్ గత చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తో పోలిస్తే ఇది మరింత భారీ అంచనాల మధ్య విడుదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. చివరి గంటల్లో ఈ బుకింగ్స్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.