నిజామాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలియజేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తన మెట్టినిల్లు నిజామాబాద్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఈ నెల 23న దుబాయ్లో బతుకమ్మ పండుగ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత రెహమాన్ కూడా హాజరవుతారని తెలిపారు. గతంలో బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసిన కవిత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా బతుకమ్మను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించడం, చీరలను పంపిణీ చేయడం, తంగేడు రాష్ట్ర పువ్వు కావడం లాంటివన్నీ తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రూపొందించిన బతుకమ్మ పాట ద్వారా బతుకమ్మ పండుగ పై మరోసారి దేశ విదేశాల్లో చర్చ జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, మేయర్ నీతూ కిరణ్, జిల్లా కలెక్టర్ సతీమణి మనీషా, పోలీస్ కమిషనర్ సతీమణి రీచా, జడ్పీ చైర్మన్ సతీమణి అనసూయ , మహిళా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.