మెహిదీపట్నం డిసెంబర్ 9: వెన్నెముక నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి వచ్చిరాని వైద్యం చేశాడో డాక్టర్.. ఆపరేషన్ సందర్భంగా నీడిల్ను శరీరంలో విరగొట్టి ప్రాణాలను హరించాడు. ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం…..మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్గూడ ఫ్రెండ్స్ కాలనీలో నివసించే షేక్ అబ్దుల్ రహీం కుమారుడు షేక్ జునైద్(21)కు ఈనెల 2వతేదీ రాత్రి ఇంట్లో ఉండగా, వెన్నెముక పై భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. కుమారుడి బాధను చూడలేని తండ్రి.. ఇంటి సమీపంలోనే ఉన్న ప్రొఫైల్ వైద్యశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ జనరల్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ సజ్జాద్ను సంప్రదించాడు.
అతడు జునైద్కు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా..తండ్రి అనుమతి లేకుండానే.. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లి చికిత్స చేశాడు. ఈ క్రమంలో రాత్రి 9. 30 నిమిషాలకు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆ డాక్టర్ .. జునైద్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని.. వెంటనే టోలిచౌకిలోని యాపిల్ ఆస్పత్రికి తరలించాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన డాక్టర్ సజ్జాద్ తిరిగి అక్కడి వైద్యులతో సంప్రదించి ఆపరేషన్ చేయడం మొదలు పెట్టాడు. 3న తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జునైద్ మరణించాడని.. కుటుంబసభ్యులకు సజ్జాద్ సమాచారం ఇచ్చాడు.
తన క్లినిక్లో ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్ సజ్జాద్ జునైద్ శరీరంలో నీడిల్ను విరిచి వదిలివేశాడు. తన తప్పిదాన్ని కప్పి పుచ్చి కుటుంబసభ్యులను ఓదార్చి మృతదేహాన్ని వారికి అప్పగించాడు. అదే రోజు జునైద్ మృతదేహానికి సెవన్టూంబ్స్ నుంచి షేక్పేట్ వెళ్లే దారిలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, బుధవారం డాక్టర్ నిర్లక్ష్యం గురించి తెలుసుకున్న తండ్రి అబ్దుల్ రహీం గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. గురువారం సమాధి నుంచి జునైద్ మృతదేహాన్ని బయటకు తీసి.. ఉస్మానియా వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు.
జునైద్కు ఫుప్పాల్గూడ ప్రొఫైల్ హాస్పిటల్లో చికిత్స చేసే సమయంలో నీడిల్ విరిగి శరీరంలోనే ఉండి పోయింది. దీంతో రక్త స్రావం ఎక్కువై.. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. డాక్టర్ సజ్జాద్ తన తప్పిదాన్ని కప్పి పుచ్చి.. కుటుంబసభ్యులను వైద్యం చేస్తున్నామంటూ.. మభ్య పెట్టాడు. చిన్న నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన తన కుమారుడి ప్రాణాలను హరించిన డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అబ్దుల్ రహీం పోలీసులను కోరుతున్నాడు.
చార్మినార్, డిసెంబర్ 9 : వార్డుబాయ్ చికిత్స వికటించి.. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్తారాయ్(38) ఝాన్సీ బజార్లో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి అతడికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
వైద్యులు ఉదయం వరకు అందుబాటులో ఉండరని చెప్పిన వార్డు బాయ్ అబ్దుల్ సత్తార్.. కడుపునొప్పి తగ్గుతుందని ఇంజక్షన్ వేయగా, తెల్లవారుజామున అస్తారాయ్ చనిపోయాడు. వార్డు బాయ్ అందించిన చికిత్స వల్లే అస్తారాయ్ చనిపోయాడంటూ.. కుటుంబసభ్యులు వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం నివేదిక అందిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ గురునాయుడు తెలిపారు.