పాలమూరు ప్రాజెక్టుతో పెరగనున్న ఆయకట్టు
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 లక్షల ఎకరాలు
లిఫ్ట్ పూర్తయితే సుమారు 20 లక్షల వరకు..
మహబూబ్నగర్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆయకట్టు విశేషంగా పెరగనున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాజెక్టుల ద్వారా సుమారు 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. పీఆర్ఎల్ఐ కింద 68 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఆరు రిజర్వాయర్లతో 12.30 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందించనున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో సుమారు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది. ప్రస్తుతం సాగునీటిని అందిస్తున్న ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యం పెంచితే మరో లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగే అవకాశం ఉన్నది. దీంతో ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్టుల నుంచి సుమారు 20 లక్షల ఆయకట్టుకు నీరందనున్నది. పసిడి పంటలకు పాలమూరు కేరాఫ్ అడ్రస్గా మారనున్నది. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరులో బంగారు పంటలు పండనున్నాయి. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పాలమూరుతోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సైతం సాగునీటిని అందించనున్న పీఆర్ఎల్ఐను ఏడాదిలోగా పూర్తి చేసేందుకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఆయకట్టును పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు పుష్కలంగా సాగునీటిని అందించేందుకు కసరత్తు కొనసాగుతున్నది.
జూరాల పరిధికి సైతం నీళ్లు..
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులకు జూరాల గుండె కాయలా మారింది. జూరాలపై ఆ ధారపడే నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా, జూ రాల ఆయకట్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టులున్నాయి. వేసవి వస్తే జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యత ఇబ్బందిగా మారుతున్నది. ఈ తరుణంలో జూరాలపై ఆ ధారపడిన ప్రాజెక్టులకు సైతం పీఆర్ఎల్ఐ ద్వారా నీటిని మళ్లించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. సీ ఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అందుకే కరివెన రిజర్వాయర్ నుంచి కోయిల్సాగర్, సంగంబండ రిజర్వాయర్లకు నీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తద్వారా వేసవిలో ఏర్పడే సాగునీటి సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉన్నది. కరివెన రిజర్వాయర్ నుంచి కోయిల్సాగర్, సంగంబండకు గ్రావిటీ కెనాల్ నిర్మించడానికి అధికారులు సర్వే చేసేందుకు సిద్ధమయ్యారు. గ్రావిటీ కెనాల్ ద్వారా కోయిల్సాగర్కు.. అక్కడి నుంచి సంగంబండకు కరివెన నీటిని తరలించనున్నారు. దీంతో కోయిల్సాగర్ పాత, కొత్త ఆయకట్టు కలిపి సుమారు 50వేల ఎకరాలకు పైగా సాగు కానున్నది. సంగంబండకు సైతం పూర్తి స్థాయిలో 62,800 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బంది తీరనున్నది.
పనులపై ప్రత్యేక దృష్టి..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అం దుకే ప్రాజెక్టు పరిధిలో అనువైన ప్రాంతంలో గెస్ట్ హౌస్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ప్ర స్తుతం పనులు వేగంగా జరగాల్సి ఉన్న ఉదండాపూ ర్ రిజర్వాయర్ సమీపంలో గెస్ట్ హౌస్ నిర్మించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉ దండాపూర్ సమీపంలోనే హెలీప్యాడ్ సైతం సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకుగానూ అన్ని ఏర్పాట్లు కల్పించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. పనులు వేగవంతం గా సాగుతున్నా.. పలు చోట్ల మాత్రం ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ పనులు వేగవంతం చే సేందుకు అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. ప్యాకేజీ-1లో మట్టి పనులు, నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కుడికిళ్ల వరకు కాలువ తవ్వకం పనులను త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు మరిం త వేగంగా చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మిగిలిపోయిన భూసేకరణ చేపట్టి ఈ ఏడా ది చివరిలోగా పనులు పూర్తి చేయనున్నారు.