హనుమకొండ, జూన్ 25 : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గురువారం ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026) కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు సైతం ఆయా జిల్లాల యంత్రాంగాలు ప్రారంభింద్చయి. ఆయా నియోజకవర్గాల్లోని బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం ఇప్పటికే బీఎల్వోలకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన సామగ్రి అందజేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం వచ్చేనెల 24 వరకు కొనసాగనుంది.
అర్హులైన ప్రతి పౌరుడి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు, బహుల కార్డులున్న, మృతి చెందిన, అనర్హుల పేర్లు తొలగించడం, పొరపాట్లను సరిచేసి ఖచ్చితమైన ఓటరు జాబితాను రూపొందించడం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. ఉమ్మడి జిల్లా పరిధిలోని వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, పాలకుర్తి, జనగామ, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలు సర్ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, వారి వ్యక్తిగత వివరాలు, చిరునామా మార్పులు, కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు ధ్రువీకరిస్తున్నారు. బీఎల్వోలు ఇప్పటికే ప్రస్తుత ఓటరు వివరాలను 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేశారు. తొలిరోజు ప్రక్రియను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. కాగా పరకాల నియోజక వర్గంలో 87.36, వరంగల్ పశ్చిమలో 68.02 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు నమోదై ఉన్నా, తప్పుడు వివరాలిచ్చినా చట్టవిరుద్ధమని, వారిపై నిబంధనల మేరకు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయా జిల్లాల ఉన్నతాధికారులు తెలిపారు. ఈసీఐ సెక్షన్ 31 ప్రకారం రెండుచోట్ల ఓటు హకుంటే ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. సర్కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.
కాగా, సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లు తమ వివరాలను సరిచూసుకొని, బీఎల్వోలకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.