కొడంగల్, మార్చి 24: పూర్వకాలంలో వస్తు మార్పిడి విధానాలతో వ్యాపారాలు జరుగుతుండేవి. సోలెలు, కొలమానాలతో ధాన్యం కొలతలు చేసేవారు. ఇప్పటికీ రావులపల్లి సంతలో అదే సంస్కృతి కొనసాగుతున్నది. సంతలో తక్కెడ తూకాలతో కిలో, అరకిలో, పావుకిలోల చొప్పున కూరగాయలు కొంటారు. సేరు, సోలా, తవ్వ, మానెడు వంటి కొలమానాలతో ధాన్యం కొనుగోలు చేస్తుంటారు.
రావులపల్లి సంతకు ప్రాధాన్యత
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని రావులపల్లి గ్రామంలో వారాంతపు సంతను గురువారం నిర్వహిస్తారు. కొడంగల్ మండలంలో ఆయా వారాల్లో కొడంగల్, అంగడిరైచూర్, రావులపల్లి, రుద్రారం, హస్నాబాద్ గ్రామాల్లో సంతలు జరుగుతాయి. ఈ సంతల్లోనే చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు వారానికి సరిపడా కూరగాయలు, బట్టలు, వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. తెలంగాణ సరిహద్దులోని రావులపల్లి గ్రామంలో ప్రతి గురువారం పెద్ద సంత జరుగుతుంది. రావులపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని గ్రామాలున్నాయి. ఈ సంతలో స్థానికులే కాకుండా అధిక మొత్తంలో కర్ణాటక ప్రాంత ప్రజలు, వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు పాల్గొంటారు. అమ్మకాలు, కొనుగోళ్లు చేపడుతుంటారు.
సంతకు ఇరు రాష్ర్టాల ప్రజలు
రావులపల్లి సంతలో కొడంగల్ మండలంలోని రావులపల్లి, కస్తూర్పల్లి, ఇందనూర్, అంగడిరైచూర్, నీటూర్, మాటూర్, కుప్పగిరి, చంద్రకల్ తదితర గ్రామాలు పాల్గొంటాయి. కర్ణాటక రాష్ట్రంలోని రెబ్బన్పల్లి, గోపన్పల్లి, బొందెంపట్టి, కర్నెపల్లి, నాడేపల్లి, ముధోల్, మల్లవాద, సిలార్ కోట్రికె, మెత్కు, కానగడ్డ గ్రామాల ప్రజలు సంతకు వస్తుంటారు.
కొనసాగుతున్న అదే చరిత్ర..
నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల్లో కొడంగల్ మండలంలోని రావులపల్లి సంతకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయా మండలాల్లో జరిగే సంతలో వినియోగదారులు డబ్బులు చెల్లించి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కానీ రావులపల్లి సంతలో ఇలాంటి వ్యాపారాలతో పాటు వస్తు మార్పిడి వ్యాపారం జరుగడం విశేషం. సంతలో తక్కెడ తూకాలతో కిలో, అరకిలో, పావుకిలోల మాదిరి కూరగాయలు కొనుగోలు చేస్తారు. సేరు, సోలా, తవ్వ, మానెడు వంటి కొలమానాలతో ధాన్యం కొనుగోలు చేస్తుంటారు. సేరుతో ధాన్యం కొలతలు చేయగా ఒకటిన్నర కిలోలు, సొలా పరికరంతో కొలిస్తే రెండున్నర కిలోల తూకం వస్తుంది. తక్కెడ తూకం కంటే కొనుగోలు దారులకు సేరు, సవ్వసేరు. తవ్వ, మానెడు వంటి కొలతల వల్ల కొనుగోలుదారులు లాభం పొందుతున్నట్లుగా చెబుతుంటారు.