‘కొత్తదనాన్ని నమ్మి నేను చేసిన సినిమాల్ని ప్రేక్షకులు ప్రతీసారి ఆదరించారు. ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టే వైవిధ్యమైన ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రమిది’ అన్ని అన్నారు అగ్రహీరో వెంకటేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దృశ్యం-2’. జీతూజోసెఫ్ దర్శకుడు. ఆంటోని పెరంబవూర్, రాజ్కుమార్ సేతుపతి, సురేష్బాబు నిర్మించారు. మీనా ప్రధాన పాత్రధారి. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా విడుదలకానున్నది. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ ‘రాంబాబు లాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉండాలనిపించేలా నా క్యారెక్టర్ సాగుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతడు పడే తపన మనసుల్ని కదిలిస్తుంది. ఆరేళ్ల పాటు రాంబాబు దాచిన ఓ నిజం ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది ఉత్కంఠను పంచుతుంది’ అని తెలిపారు. ‘మలయాళ వెర్షన్ చూసి అగ్ర దర్శకుడు రాజమౌళి అభినందించడం మరువలేను. మూలకథలో మార్పులు చేయకుండా తెలుగు నేటివిటీకి తగినట్లుగా సినిమా చేశాం’ అని దర్శకుడు జీతూజోసెఫ్ చెప్పారు. కుటుంబ ప్రేక్షకులు థియేటర్స్కు వచ్చే పరిస్థితి లేనందునే ఓటీటీలో సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు అన్నారు. తన పాత్ర బాగా రావడంలో వెంకటేష్ చక్కటి సలహాలిచ్చారని మీనా తెలిపింది. ఈ కార్యక్రమంలో నరేష్, ఏస్తర్ తదితరులు పాల్గొన్నారు.