కాశీబుగ్గ, డిసెంబర్ 14: గ్రేటర్ వరంగల్ పరిధిలోని డివిజన్లలో సమస్యలు పరిష్కరించేందుకే నగరబాట కార్యక్రమం చేపట్టినట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం 14వ డివిజన్లోని సాయిగణేశ్కాలనీ, సుందరయ్యనగర్, 18వ డివిజన్లోని పార్కులు, శ్మశాన వాటికలను ఆమె మంగళవారం కమిషనర్ ప్రావీణ్య, వింగ్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. బాలాజీనగర్ జంక్షన్ అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
18వ డివిజన్లో రూ. కోటి అంచనా వ్యయంతో కొనసాగుతున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. ప్రతాప్నగర్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిశీలించి పిల్లల పార్కును ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సాయిగణేశ్కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేయర్ను సత్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తూర్పాటి సులోచన, మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్వో సునీత, సీపీ వెంకన్న, డీఎఫ్వో కిశోర్, డిప్యూటీ కమిషనర్ జోనా, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. అలాగే, 18వ డివిజన్లో డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీమ్ మసూద్ పర్యటించారు. ప్రతాప్నగర్, క్రిష్టియన్కాలనీ, టీఆర్టీ, ఎస్ఆర్టీకాలనీలో అభివృద్ధి పనులు తెలుసుకున్నారు.
పోచమ్మమైదాన్: నగరబాటలో భాగంగా ఎల్బీనగర్, నవయుగకాలనీ, ఎంహెచ్నగర్లో మేయర్, కమిషనర్ ప్రావీణ్య పర్యటించారు. జగ్జీవన్ విగ్రహం సమీపంలో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు తెలుసుకుని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ 13వ డివిజన్ ఎంహెచ్నగర్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ పర్యటించారు. ఎల్బీనగర్, కట్టకింది ఏరియా, దేశాయిపేట, వీవర్స్కాలనీలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.