గ్రేటర్ నడిబొడ్డున ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్ పార్కు) తరహాలో శివారుల్లోని అటవీ ప్రాంతాలను హెచ్ఎండీఏ అధికారులు అత్యాధునిక హంగులతో అర్బన్ ఫారెస్టు బ్లాకులుగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా వందలాది ఎకరాల్లో విస్తరించిన ఉన్న హెచ్ఎండీఏ పరిధిలోని 16 అటవీ ప్రాంతాలను రక్షించేందుకు ప్రహరీలను నిర్మించి సుందరంగా ముస్తాబు చేశారు. త్వరలో నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం చేశారు.
శివారు ప్రాంతాల్లోని అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. నగరం నలువైపులా ఉన్న ఆరు జిల్లాల పరిధిలోని 16 అటవీ ప్రాంతాల్లో నగరవాసులు హాయిగా గడిపేలా అవసరమైన అన్ని మౌలిక వసతులను అందులో కల్పించింది. ఇందుకోసం సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేసినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. రెండేండ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించినా కరోనా మహమ్మారి కారణంగా కొంత జాప్యం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు- సెప్టెంబర్ నెలల్లో అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల్లోని అసంపూర్తి పనులను అధికారులు పూర్తి చేశారు. నెల రోజుల క్రితమే పెండింగ్ పనులు పూర్తి అయినా రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు ఉండటంతో వాయిదా వేస్తూ వచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగియగానే ఒకే సారి 16 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను ప్రారంభించాలని నిర్ణయించారు.
హెచ్ఎండీఏ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని వందలాది అటవీ భూములను పరిరక్షించడంతో పాటు వాటిని ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 59 అటవీ ప్రాంతాలు ఉండగా.. ఇందులో హెచ్ఎండీఏ పరిధిలోని 16 అటవీ ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ బ్లాకులుగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. రకరకాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో ముఖ్యంగా సందర్శకుల జోన్లో పార్కింగ్, ఎంట్రీ ప్లాజా, పాత్వేస్, థీమ్ పార్కులు, వాష్రూములు, తాగునీటి సౌకర్యం, కూర్చునేందుకు సీట్లు ఏర్పాటు చేశారు. అంతేకాక 16 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల చుట్టూ ప్రహరీలను హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నిర్మించారు.