లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసుల దాష్టీకం వల్ల ఒక చిరు వ్యాపారిని రైలు ఢీకొన్నది. దీంతో ఆ యువకుడు తన రెండు కాళ్లను కోల్పోయాడు. బీజేపీ పాలిత యూపీలోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. కళ్యాణ్పూర్ ప్రాంతంలోని సాహిబ్ నగర్కు చెందిన 18 ఏళ్ల అర్సలాన్, కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జీటీ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నాడు. శుక్రవారం పోలీసులు ఆ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు పోలీసులు అర్సలాన్ వద్దకు వెళ్లారు. అతడ్ని కొట్టడంతోపాటు దురుసుగా ప్రవర్తించారు. హెడ్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్ తూకం పరికరాన్ని లాక్కొన్ని పక్కనే ఉన్న రైలు పట్టాలపై పడేశాడు.
కాగా, తూకాన్ని తెచ్చుకునేందుకు రైలు పట్టాల వద్దకు వెళ్లిన అర్సలాన్ను వేగంగా వచ్చిన రైలు ఢీకొన్నది. దీంతో అతడి రెండు కాళ్లు తెగాయి. రైళ్లు పట్టాల వద్ద పడి ఉన్న ఆ యువకుడు సహాయం కోసం అర్తనాదాలు చేశాడు. పోలీసులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మరోవైపు స్థానికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. కూరగాయలు అమ్మే యువ వ్యాపారి అర్సలాన్ పట్ల దురుసుగా ప్రవర్తించి అతడి రెండు కాళ్లు కోల్పోవడానికి కారణమైన హెడ్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.