హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి పథకంలో నిధుల వ్యయాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా చేపట్టనున్నారు. ఇందుకుగాను ప్రతిబడికి రెండు కొత్త బ్యాంక్ ఖాతాలను తెరవాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులకు ఒకటటి, విరాళాలు, సీఎస్సార్ నిధులకు మరో ఖాతాను నిర్వహిస్తారు. ఏదైనా జాతీయ బ్యాంకులో ఈ ఖాతాలు తెరవాలని అధికారులు తెలిపారు.
ఖాతాలు తెరిచే తీరు..
ప్రభుత్వం మంజూరుచేసే నిధులను ఖర్చుచేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు – మన బడి (ఎస్ఎంసీ) పాఠశాల పేరుతో ఖాతాను తెరవాలి. ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎంసీ చైర్మన్, సర్పంచ్, అసిస్టెంట్ ఇంజినీర్ల పేర్లతో ఖాతా ఉం డాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే మనబస్తీ – మన బడి పేరుతో సర్పంచ్కు బదులుగా మున్సిపల్ చైర్మన్, మేయర్ సభ్యులుగా ఖాతా నడపాలి. ప్రతి మండలానికి ఒక ఇంజినీరింగ్ విభాగం ఏఈని కేటాయించారు. వారితో మాత్రమే ఖాతా లు ఓపెన్ చేయాలని అధికారులంటున్నారు.
విరాళాలను సమీకరించి, ఖర్చుచేసేందుకు విడిగా మరో బ్యాంకు ఖాతాను తెరవాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనఊరు – మనబడి (డొనేషన్స్) పాఠశాల పేరుతో ఖాతా ఓపెన్ చేయాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎంసీ చైర్మన్, ఇద్దరు పూర్వవిద్యార్థులతో ఖాతా నడుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మన బస్తీ – మన బడి (డొనేషన్స్) పాఠశాల పేరుతో హెచ్ఎం, ఎస్ఎంసీ చైర్మన్, ఇద్దరు పూర్వ విద్యార్థులతో ఖాతాను నడపాలి.