నల్లగొండ : ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యులేనని ఆయన పేర్కొన్నారు. వారి సహకారంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. అటువంటి ఉద్యోగులు మండలి ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీఆర్ఎస్నే బలపరుస్తున్నారని, ఇందులో ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి పక్షాలు ఆడుతున్న అబద్ధాలకు ఆచార్య కోదండరామ్ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ పాలన రాక్షసత్వాన్ని మరిపిస్తోందని ఆయన విమర్శించారు.
బీజేపీ పాలనలో సామాన్యులకు ఆదాయం తగ్గిందని, అదే సమయంలో అంబానీ, ఆదానీల ఆదాయం మాత్రం రెట్టింపు అయిందంటూ ఆయన దెప్పి పొడిచారు.700 శాతం ఆదాయం ఆదానిది పెరిగితే అంబానీది 370 శాతానికి పెరగడమే అందుకు నిదర్శనమన్నారు. వంట గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నా బీజేపీ పాలకుల్లో చలనం లేదని దుయ్యబట్టారు. డీజిల్,పెట్రోల్ ధరలు అందనంత దూరం పోతుండడంతో సామాన్యులు కుదేలు అవుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కార్యక్రమలో శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ మండలి సభ్యుడు పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.