హైదరాబాద్ : రాష్ర్టంలోని పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 2014 కంటే ముందు తెలంగాణలో 249 గురుకుల పాఠశాలలు ఉంటే ఇప్పుడు స్వరాష్ర్టంలో ఆ సంఖ్య 969కి చేరిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, సన్నబియ్యంతో భోజనం వడ్డిస్తున్నామని తెలిపారు. విద్యా విషయంలో అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకుల విద్యార్థులు నీట్, ఐఐటీలో సీట్లు సాధించారని తెలిపారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకాల ద్వారా దళిత విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు. కరీంనగర్లో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ విద్యారంగంలో తీసుకున్న మార్పుల వల్లే సాధ్యమైందన్నారు. కొడిమ్యాల మండలంలో డిగ్రీ కాలేజీ, రామడుగు మండలంలో జూనియర్ కాలేజీని, చొప్పదండికి ఐఐటీ కాలేజీని మంజూరు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు.