మంచిర్యాల, జనవరి 31: కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారి మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా సోమవారం చెన్నూర్ నియోజకవర్గంలోని ఇందారం వద్ద కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన భారీ బైక్, కారు ర్యాలీ శ్రీరాంపూర్, మంచిర్యాల మీదుగా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ వరకు సాగింది. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్కు కంచుకోట అని పేర్కొన్నారు. సహచర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో ఎగరనున్నది గులాబీ జెండానే అని, రానున్న ఎన్నికల్లో జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లోభారీ మెజార్టీతో గెలుస్తామని ఉద్ఘాటించారు. త్వరలోనే పార్టీ పరంగా జిల్లాలోని అన్ని కమిటీలను పూర్తి చేసి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని, అవసరమైతే శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్, దుర్గం చిన్నయ్య, రేఖానాయక్, కోరుకంటి చందర్, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.