హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మట్టి విముక్తి కోసం పుట్టిన టీఆర్ఎస్ 20 ఏండ్ల ఉజ్వల ప్రస్థానంలో చరిత్రాత్మక విజయకేతనం ఎగురవేసిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ‘టీఆర్ఎస్ విజయాలు, ఆవిష్కరణలు, సాగునీరు, వ్యవసాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి’పై తీర్మానాన్ని ఆయ ప్రవేశపెట్టారు. జలదృశ్యం నుంచి సుజల సఫలం వరకు టీఆర్ఎస్ ప్రస్థానంలో అనేక చారిత్రక ఘనటలున్నాయని అన్నారు. టీఆర్ఎస్ పుట్టుకే ఓ సంచలనం అని చెప్పారు. 14 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో, ఏడేండ్ల రాష్ట్ర అభివృద్ధిలో నాయకుడు కేసీఆర్ ఆత్మవిశ్వాసం, కార్యదక్షత, పట్టుదల కన్పిస్తున్నాయని కొనియాడారు.
సంస్కృతికి గౌరవం తెచ్చిన నాయకుడు
తెలంగాణ సమాజ అవసరాలను గుర్తించి సీఎం కేసీఆర్ ఏడేండ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించడం ద్వారా రాష్ర్టాన్ని దేశానికే అన్నపూర్ణగా మార్చారని నిరంజన్రెడ్డి అన్నారు. హరితహారంతో తెలంగాణ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని చెప్పారు. భాషాసంస్కృతిలో అవహేళన చేసిన నాటి స్థితినుంచి సినిమాల్లో హీరో హీరోయిన్లకు తెలంగాణ భాష పెడితే సూపర్ హిట్ అవుతుందనే స్థాయికి సీఎం తీసుకొచ్చారని కొనియాడారు. చైనాను తలదన్నేరీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. ఈ ప్రాజెక్టును సందర్శించిన అప్పటి గవర్నర్ నరసింహన్..‘చంద్రశేఖర్రావు కాదు.. నీ పేరు కాళేశ్వరరావు’ అని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని, చివరకు ఎఫ్సీఐ తాము కొనలేమనేంతగా ధాన్యం పండిందని పేర్కొన్నారు. వానకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ.7,380 కోట్ల రైతుబంధు ఇచ్చినట్టు తెలిపారు. వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, ఈ పథకాలన్నీ ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తామని మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
గొల్లకురుమకు ఇతోధికంగా సాయం: అరికెల నాగేశ్వర్రావు
సీఎం కేసీఆర్ అన్నిరంగాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని టీఆర్ఎస్ నేత అరికెల నాగేశ్వరరావు తెలిపారు. కేసీఆర్ దూరదృష్టితో సాధించిన తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావాలంటే కులవృత్తులు బాగుపడాలని భావించిన కేసీఆర్, గొల్లకురుమలకు ఇతోధికంగా సహాయం చేశారని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో, కేంద్రంలో రైతులు ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డారని చెపుతూ నిరంజన్రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నానని చెప్పారు.
పరమపద వాహనాలు తెలంగాణలోనే: సీఎం కేసీఆర్
తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కో సమస్యను తీర్చుకొంటూ పోతున్నామని తెలిపారు. హైదరాబాద్లో ఎవరైనా చనిపోతే ఇంటికి తీసుకెళ్లటానికి మార్గంలేని పరిస్థితి ఉండేదని, దీంతో ప్రత్యేకంగా పరమపద వాహనాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ వాహనాలు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని వెల్లడించారు.