హైదరాబాద్ : 18 సంవత్సరాల్లోపు పిల్లలకు త్వరలోనే మరో టీకా అందుబాటులోకి రానున్నది. కొవాగ్జిన్ టీకాపై రెండు, మూడో దశల క్లినికల్ ట్రయల్స్ను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. ప్రయోగాలకు సంబంధించిన డేటాను వచ్చే వారంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. పీడియాట్రిక్ కొవాగ్జిన్ రెండు, మూడో దశ ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నారు. వెయ్యి మంది చిన్నారులపై ట్రయల్స్ నిర్వహించినట్లు చెప్పారు.
ప్రస్తుతం డేటాపై అధ్యయనం కొనసాగుతుందని, వచ్చే వారం నివేదికను డీసీజీఐకి అప్పగించే అవకాశం ఉందన్నారు. అలాగే ఇంట్రానసల్ వ్యాక్సిన్ ట్రయల్స్ సైతం రెండో దశలో ఉన్నాయని తెలిపారు. అక్టోబర్లో పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ముక్కు ద్వారా ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న వైరస్ను నాశనం చేస్తుందని తెలిపారు. టీకాను 650 మందిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ బయోటెక్ ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉందని కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో అవసరాన్ని తీర్చడమే మా ప్రయత్నం అని పేర్కొన్నారు.