న్యూఢిల్లీ/ది హేగ్/లండన్, నవంబర్ 27: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నది. డెల్టాకంటే ప్రమాదకరమన్న భయాల నేపథ్యంలో.. పరిస్థితి చేయిదాటక ముందే వైరస్ను నిలువరించేందుకు ఆయా దేశాలు తిరిగి ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికాతోపాటు పలు ఆఫ్రికా దేశాలపై అమెరికా తదితర దేశాలు ఇప్పటికే ప్రయాణ ఆంక్షలను విధించాయి. ఒమిక్రాన్పై భారత్ కూడా అప్రమత్తమైంది. శనివారం ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రయాణాలపై సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, రాష్ర్టాలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ను కట్టుదిట్టం చేస్తున్నాయి. రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఆదివారం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ఒమిక్రాన్ తేలిగ్గా వ్యాపించగలదని, రోగనిరోధకతను తప్పించుకుని మరీ దాడి చేయగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తున్నారు.
ఆఫ్రికా దక్షిణ ప్రాంత దేశాలపై ప్రయాణ ఆంక్షల పర్వం కొనసాగుతున్నది. బ్రిటన్, ఈయులోని పలు దేశాలతో పాటు తాజాగా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఇరాన్, జపాన్, థాయిలాండ్లు కూడా ఆ జాబితాలో చేరాయి. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిస్తున్నట్లు తెలుస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా శుక్రవారం ఒక సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణ ఆంక్షలను ప్రకటిస్తూ.. మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కరోనా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ హోచుల్ నగరంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కరోనాతో దవాఖానల్లో చేరుతున్న వారి సంఖ్య గతనెల నుంచి పెరుగుతున్నదని అన్నారు.
ఆంక్షలు క్రూరం
పలు దేశాలు విధిస్తున్న ప్రయాణ ఆంక్షలను దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి జోయ్ పాహ్లా ఆక్షేపించారు. శాస్త్రీయపరమైన ఆధారాలను చూడకుండా విధిస్తున్న ఈ ఆంక్షలు క్రూరమైనవని, ప్రతికూలమైనవని అన్నారు. ఇతరులను నిందించకుండా కరోనా మహమ్మారిపై అన్నిదేశాలు ఉమ్మడి పోరు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.
బ్రిటన్, నెదర్లాండ్స్కు పాకిన ఒమిక్రాన్
విమానాల రాకపోకలను నిలిపేస్తున్నప్పటికీ, ఒమిక్రాన్ వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తున్నది. బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా బ్రిటన్లో కూడా రెండు కేసులు నిర్ధారణ అయ్యాయని అక్కడి ప్రభుత్వం శనివారం పేర్కొన్నది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 61 మందిలో ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలడంతో నెదర్లాండ్స్ అప్రమత్తమైంది.
వంద రోజుల్లో టీకా
ఒమిక్రాన్ చికిత్సల్లో తమ వ్యాక్సిన్లు సాయపడతాయనే దానిపై కచ్చితంగా చెప్పలేమని ఫైజర్, బయోఎన్టెక్ ఫార్మా కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. కొత్త వేరియంట్కు 100 రోజుల్లోగా వ్యాక్సిన్ తయారు చేస్తాయని ఆయా కంపెనీలు ఈ సందర్భంగా హామీనిచ్చాయి.
వ్యాక్సిన్ల సామర్థ్యంపై నిపుణుల ఆశాభావం
ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ను సమర్థంగా ఎదుర్కొనగలవని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని ధ్రువీకరించుకునేందుకు కొన్ని వారాలు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. ఒమిక్రాన్లో ఉన్న మ్యుటేషన్లు ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లలో కూడా ఉన్నాయని, వ్యాక్సిన్లు వీటిని సమర్థంగా ఎదుర్కొన్నాయని ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారు చేసిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూపు డైరెక్టర్ ప్రొఫెసర్ అండ్య్రూ పోలార్డ్ పేర్కొన్నారు. అందరూ భయపడుతున్నట్లుగా ఒమిక్రాన్ పెద్ద విపత్తు ఏమీ కాదని, పరిస్థితిని అతిగా అంచనా వేస్తున్నట్లు కనిపిస్తున్నదని బ్రిటన్కి చెందిన ఎస్ఏజీఈ శాస్త్రవేత్త, మైక్రోబయాలజిస్టు కాలమ్ సెంపుల్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో కరోనా కొత్త రకం వేరియంట్ ‘ఒమిక్రాన్’ విస్తరిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్టులో పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న సర్కారు.. వైరస్ వ్యాప్తి తీరు తెన్నులు, వివిధ దేశాలు, రాష్ట్రాలు తీసుకుంటున్న కట్టడి చర్యలను నిశితంగా గమనిస్తున్నది. వైరస్ వేవ్ రూపంలో వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా, ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఆయా దేశాల్లో ప్రస్తుత పరిస్థితులేంటి.. అనే అంశాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యాధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను సమీక్షించండి: మోదీ
ఒమిక్రాన్ పరిణామాలు, పర్యవసానాలపై శనివారం ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై విధించిన ఆంక్షల సడలింపును సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులు భారత్కు వచ్చిన వెంటనే వారికి కరోనా మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని ఆదేశించారు.
ముందస్తు జాగ్రత్తల్లో రాష్ర్టాలు
కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచామని, వారి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు ముంబై మేయర్ కిషోరి పద్నేకర్ తెలిపారు. వ్యాక్సినేషన్ పూర్తి కాని, కరోనా ముప్పు అధికంగా ఉండే దేశాల నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని గుజరాత్ సర్కార్ పేర్కొన్నది. అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని కేరళ మంత్రి వీణాజార్జి తెలిపారు.
వారికి సోకింది ఒమిక్రాన్ కాదు..
దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిని క్వారంటైన్కు పంపారు. ఇది కొత్త వేరియంటేమోనని వైద్యాధికారులు మొదట భయాందోళన చెందారు. అయితే వీరికి డెల్టా వేరియంట్ సోకినట్లు తదుపరి పరీక్షల్లో తేలింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలో నెగెటివ్గా తేలిన తర్వాతనే ఎయిర్పోర్టు బయటకు పంపిస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి కే.సుధాకర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసినట్టు అధికారులు తెలిపారు.
‘ఎట్ రిస్క్’ దేశాల జాబితా