న్యూఢిల్లీ: ‘అన్నేసి చూడు.. నన్నేసి చూడు’ అని ఉప్పు అంటే, నన్ను వేయకుండా కూర వండి చూడు అంటుందట టమాటా. నిజమే మరి. వెజ్, నాన్వెజ్, పప్పులు, ఆఖరికి పిజ్జా, బర్గర్లో పెట్టుకునే కెచప్ వరకు టమాటానే కీలకం. ఇప్పుడు ఆ సీమ వంగ పండే (టమాటా) సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ. 120 పలుకుతున్నది. కూరగాయలు, ఉల్లి, పాలు, పప్పులు, వంట నూనెల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే, కేంద్రం మాత్రం చేష్టలుడిగి చూస్తున్నది. ధరల కట్టడికి నిధిని ఏర్పాటు చేసుకోవాలని రాష్ర్టాలకు ఉచిత సలహానిస్తున్నది.
అక్టోబర్-డిసెంబర్ కాలంలో టమాటా పంట అధికంగా వచ్చే కర్ణాటక, ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పెద్దఎత్తున ఆ పంట ధ్వంసమైంది. యూపీ, బెంగాల్, బీహార్, గుజరాత్లో వర్షాల కారణంగా ఆలుగడ్డ, ఇతర వానకాలం పంటలు దెబ్బతిన్నాయి. మహారాష్ట్రలో ఆగస్టులో లోటు వర్షపాతం నమోదవ్వడంతో ఉల్లిగడ్డ వేయడం ఆలస్యమైంది. అందుకే, కూరగాయల ధరలు పెరిగినట్టు నిపుణులు తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పెంచడంతో విపణిలోకి పంటను తీసుకురావడానికి వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటం కూడా టమాటా ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పాలు, పప్పులు, వంటనూనెల ధరల పెరుగడానికి ఇంధన ధరలు పరోక్షంగా కారణమయ్యాయని సాధారణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వచ్చే నెల నుంచి టమాటా ధరలు దిగివస్తాయని కేంద్రం చెబుతున్నది. ఉత్తరాది రాష్ర్టాల నుంచి సరఫరా పెరుగడమే దీనికి కారణమని వెల్లడించింది.