Tollywood Theaters | తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల ప్రదర్శన వేతనాలు, పర్సంటేజీ విధానంపై నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాల మధ్య నడుస్తున్న వివాదానికి ఎట్టకేలకు ఒక ముగింపు లభించేలా కనిపిస్తోంది. టాలీవుడ్లో నెలకొన్న ఈ ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) రంగంలోకి దిగింది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేశ్బాబు నేతృత్వంలో శుక్రవారం చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో థియేటర్ల ప్రతినిధులు, అగ్ర నిర్మాతలతో కూడిన అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీలో వివాదాస్పదంగా మారిన ‘పర్సంటేజీ షేరింగ్’ విధానంపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకుగానూ ఫిల్మ్ ఛాంబర్ 15 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరిశ్రమలోని మూడు ప్రధాన వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ.. ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు, ఐదుగురు ఎగ్జిబిటర్లతో ఈ కమిటీని సమతుల్యంగా రూపొందించారు. ఈ 15 మందితో కూడిన కమిటీ థియేటర్ల నిర్వహణ ఖర్చులు, వర్చువల్ ప్రింట్ ఫీజు (VPF), టికెట్ లాభాల వాటాలపై లోతుగా అధ్యయనం చేసి, రాబోయే రెండు నెలల్లో తమ తుది నివేదికను ఛాంబర్కు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ సమావేశం అనంతరం ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమ క్షేమం కోసం అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో ఈ పర్సంటేజీ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుందని, అప్పటివరకు థియేటర్ల ప్రదర్శనలు, కొత్త సినిమాల విడుదలలు యథావిధిగా సాగుతాయని స్పష్టం చేశారు. అందువల్ల ప్రేక్షకులుగానీ, ఇండస్ట్రీ వర్గాలు గానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు టాలీవుడ్కు చెందిన దాదాపు 50 మందికి పైగా ప్రముఖ నిర్మాతలు ఒకే తాటిపైకి రావడం విశేషం. శుక్రవారం నాటి సమావేశంలో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, చదలవాడ శ్రీనివాసరావు, సుప్రియ యార్లగడ్డ, స్రవంతి రవికిషోర్, మైత్రీ రవి, రాధా మోహన్, చెరుకూరి సుధాకర్, భోగవల్లి బాపినీడు, సాహు గారపాటి, సతీష్ కిలారు, సూర్యదేవర నాగవంశీ, ఎస్.కె.ఎన్ (SKN), రాజేష్ దండా, ధీరజ్ మొగిలినేని తదితరులు పాల్గొన్నారు. మరోవైపు థియేటర్ ఎగ్జిబిటర్ల సంఘం తరఫున విజయేందర్ రెడ్డి, శ్రీధర్ సహా పలువురు ప్రతినిధులు హాజరై తమ సమస్యలను ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా టాలీవుడ్లో సరికొత్త థియేట్రికల్ రన్ విధానానికి తెరలేవనుంది.