హైదరాబాద్, జూన్ 14 (నమస్తేతెలంగాణ): లోటు విద్యుత్తు నుంచి మిగు లు విద్యుత్తులోకి తెలంగాణను తేవాలన్న సంకల్పంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో శ్రీకారం చుట్టి 80 శాతం వరకు నిర్మాణం పూర్తిచేసిన వైటీపీఎస్ (యాదాద్రి థర్మల్ వపర్ స్టేషన్) భవిష్యత్తు.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రశ్నార్థకంగా మారింది. నల్లగొండ జిల్లా దామరచర్ల సమీపంలో నిర్మించిన దీనిని ప్రైవేటీకరించే కుట్రలకు అడుగులు పడ్డాయి. వైటీపీఎస్లో కీలకమైన యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ జెన్కోలో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. రూ.225 కోట్ల టెండర్ను అవుట్ సోర్సింగ్ విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించాలనే నిర్ణయంపై ఇంజినీరింగ్ వర్గాల్లోనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. మానవ వనరుల కొరతను సాకుగా చూపి ప్రైవేట్పరం చేసే దిశగా అడుగులు వేయడమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
విద్యుదుత్పత్తి ప్రక్రియలో ఏహెచ్పీ, సీహెచ్పీలు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే బొగ్గు బంకర్లకు చేరకపోతే విద్యుదుత్పత్తి నిలిచిపోతుంది. బూడిదను తరలించకుంటే యూనిట్ల నిర్వహణ, ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటాయి. పర్యావరణంపై పెనుప్రభావం చూపుతుంది. ఇలాంటి ముఖ్యమైన వ్యవస్థలకు సంబంధించిన ఆపరేషన్, ఎలక్ట్రికల్, సీ అండ్ ఐ, డీసీఎస్, పీఎల్సీ ట్రబుల్ షూటింగ్, బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ లాంటి బాధ్యతలను పూర్తిగా కాంట్రాక్టర్కు అప్పగించడం సంస్థ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతిమంగా సంస్థ ప్రైవేట్ వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.
తెలంగాణ జెన్కో ఇంజినీర్లు విద్యుదుత్పత్తి ప్లాంట్ను కేవలం రోజువారీ నిర్వహణ కోణంలో కాకుండా దీర్ఘకాలిక ఆస్తిగా, సొంత వ్యవహారంగా భావిస్తారు. వేలకోట్ల విలువైన యంత్రాల జీవితకాలం, భవిష్యత్తులో పనితీరు, లోపాల సవరణ, బలాలు-బలహీనతలు, మూలకారణాల విశ్లేషణ లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతారు. కాంట్రాక్టర్ మాత్రం ప్లాంట్ నిర్వహణ విషయంలో ఇంత శ్రద్ధచూపే అవకాశం ఉండబోదని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు. తనకు నిర్దేశించిన కాలంలో పని పూర్తిచేయడమే ప్రధానంగా భావిస్తారని పేర్కొంటున్నారు. యంత్రాల పనితీరు, జీవితకాలం, భవిష్యత్తులో పనివిధానం, లోపాల నివారణ ఇతరత్రా అంశాలపై తాత్కాలికంగా దృష్టి పెడుతారని, దీర్ఘకాలిక దృష్టి ఉండబోదని విశ్లేషిస్తున్నారు. సదరు కాంట్రాక్ట్ కాలంలో ఏదైనా కీలకమైన పరికరం, విడిభాగాలు దెబ్బతింటే అంతిమంగా భరించేది జెన్కో మాత్రమేనని, కానీ కాంట్రాక్ట్ బాధ్యత తన కాలం ముగిసేవరకే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఏహెచ్పీ, సీహెచ్పీల నిర్వహణ ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్లు, ఏడీఈ, డీఈలు ప్రయోగ అనుభవాన్ని పొందుతున్నారు. కన్వేయర్లు, వ్యాగన్ టిప్పర్లు, క్రషర్లు, స్టాకర్ రిైక్లెమర్లు, పీఎల్సీ, డీసీఎస్లు ఇన్స్ట్రుమెంటేషన్ వ్యవస్థలపై లోతైన అవగాహన పొందుతున్నారు. ఈ బాధ్యతలన్నీ కాంట్రాక్టర్కు వెళ్లిపోతే భవిష్యత్తు ఇంజినీర్లకు నేర్చుకొనే అవకాశాలే తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫలితంగా టీజీ జెన్కోలో సాంకేతిక నైపుణ్యం క్రమంగా తగ్గిపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఇంజినీర్ల నియామకం, ప్రమోషన్లపై పడుతుందని మనోవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తున్నారు.