(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నిర్ధిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు అసెంబ్లీ స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో హైకోర్టు సూచించినట్టు ఆ కాలవ్యవధి ఏ మేరకు ఉండవచ్చన్న చర్చ పెద్దఎత్తున జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేన (ఠాక్రే-షిండే), ఎన్సీపీ (శరద్ పవార్-అజిత్ పవార్) కేసులో గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలను న్యాయకోవిదులు ఉటంకిస్తున్నారు.
ఓ పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్లు మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. స్పీకర్ అలా చేయని పక్షంలో ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ కోర్టును ఆశ్రయించే అవకాశం ఫిర్యాదుదారులకు ఉంటుందని గుర్తుచేసింది. ఈ మేరకు మహారాష్ట్రలో శివసేన (ఠాక్రే-షిండే), ఎన్సీపీ (శరద్ పవార్-అజిత్ పవార్) కేసులకు సంబంధించి ఈ ఏడాది మొదట్లో జరిగిన విచారణలో, 2020లో మణిపూర్కు చెందిన ఓ మంత్రి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాజ్యాంగం పదో షెడ్యూల్లోని ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కు మాత్రమే ఉంటుంది. స్పీకర్ పరిమిత సమయంలో నిర్ణయం తీసుకోవాలనే నిబంధన గతంలో లేదు. దీంతో రాజకీయ ప్రయోజనాలను అనుసరించి అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగేది. ఈ ధోరణిపై దృషి ్టసారించిన సుప్రీంకోర్టు ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్లకు డెడ్లైన్లు విధిస్తున్నది. మహారాష్ట్రలోని ఎన్సీపీని చీల్చి శివసేన (షిండే)-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై ఎన్సీపీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర స్పీకర్ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. శివసేన (షిండే) ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లకు కూడా ఇదే తరహా డెడ్లైన్ విధించింది. ధర్మాసనం ఆదేశాలు పాటించకపోతే, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్న భావనతో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
1993లో కిహాట హాల్లో హాన్ వర్సెస్ జాచిల్హూ కేసులో సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతలను ప్రకటించడంలో స్పీకర్ది తుది నిర్ణయం అయినప్పటికీ, దీనిపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొన్నది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడం రాజ్యాంగబద్ధమేనని చెప్పింది.
ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడటమే కాకుండా వారి రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరమయ్యే పరిస్థితి ఉంటుందని మణిపూర్ మంత్రికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును బట్టి అర్థమవుతున్నది. మణిపూర్కు చెందిన ప్రస్తుత బీజేపీ నేత తౌనోజామ్ శ్యామ్కుమార్ సింగ్ 2017లో కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలోకి చేరడంతో మంత్రి పదవి దక్కింది. శ్యామ్పై అనర్హత వేటు వేయాలని 2017లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మూడేండ్లపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ కాలయాపన చేశారు. ఈ కేసును 2020లో విచారించిన సుప్రీంకోర్టు శ్యామ్కుమార్ను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా.. తాము ఉత్తర్వులు ఇచ్చే వరకు శ్యామ్ శాసనసభలో అడుగుపెట్టకూడదని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.
ఒక రాజకీయ పార్టీ టికెట్పై చట్టసభలకు ఎన్నికైన సభ్యులు స్వార్థప్రయోజనాలతో మరో పార్టీలోకి మారడాన్నే ‘పార్టీ ఫిరాయింపు’గా వ్యవహరిస్తారు. ఈ చర్యలను నియంత్రించడానికే 1985లో కేంద్రంలోని అప్పటి రాజీవ్గాంధీ ప్రభుత్వం.. ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ తీసుకొచ్చింది. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదో షెడ్యూల్ను చేర్చింది. ఆర్టికల్స్ 101, 102, 190, 191ల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరించారు.
ఫిరాయింపునకు పాల్పడిన సభ్యుడిపై అనర్హత వేటు వేసే నిర్ణయాధికారం పూర్తిగా సభాధ్యక్షుడికే ఉంటుంది. పార్టీ ఫిరాయింపుతోపాటు, పార్టీలో చీలిక, పార్టీ విప్ను ధిక్కరించి ఓటేయడం వంటి అంశాలు వివాదాస్పదమైనప్పుడూ నిర్ణయం తీసుకొనే అధికారం కూడా సభాధ్యక్షుడికే ఉంటుంది.
సహేతుక కారణాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా సభాధ్యక్షుడు రాజకీయ పార్టీ విలీనానికి సమ్మతించినప్పుడు ఆ ప్రక్రియను న్యాయస్థానంలో సవాల్ చేయవచ్చు. చట్టానికి లోబడి సభ్యులపై చర్యలు తీసుకోవడంలో సభాధ్యక్షుడు విఫలమైనప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చు. రాజకీయ పార్టీలు చేసే ఫిర్యాదులపై సభాధ్యక్షులు నిర్ణయం తీసుకోవడంలో ఉద్దేశపూర్వక జాప్యం చేసినప్పుడు న్యాయస్థానాలకు వెళ్లొచ్చు.