ముంబై/ న్యూఢిల్లీ: తమ ఇంట్లో ఆదాయం పన్నుశాఖ (ఐటీ) అధికారుల సోదాలపై బాలీవుడ్ కథా నాయిక తాప్సీ పన్ను సోమవారం స్పందించారు. ఈ సోదాల విషయమై భయపడాల్సిందేమీ లేదని, ఐటీ అధికారులు ఎందుకు తనిఖీలు చేపట్టారో తనకు తెలియదని పేర్కొన్నారు. ఒకవేళ తానేదైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధమేనని ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ఐటీ అధికారుల దర్యాప్తునకు తాను, తన కుటుంబం సహకరిస్తుందని తాప్పీ పన్ను వ్యాఖ్యానించారు. తన ఇంట్లో జరిగిన సోదాల్లో ఐటీ అధికారులకు ఏమీ దొరకకున్నా.. మీడియా మాత్రం తాను రూ.5 కోట్లు తీసుకున్నట్లు వార్తలు రాసిందన్నారు. తనకు రూ.5 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలు, పారిస్లో బంగళా ఉందన్న ఆరోపణలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. తొలి నుంచి తనను భయపెడుతున్నారన్నారు. తానేమీ దాచి పెట్టడం లేదని, తప్పుచేస్తే శిక్ష అనుభవించేందుకు సిద్ధం అని ఆమె పేర్కొన్నారు.
ఈ నెల మూడో తేదీన తాప్సీ పన్ను, సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు జరిపిన సంగతి తెలిసిందే. పన్ను ఎగవేతకు సంబంధించి ఫాంటోమ్ ఫిల్మ్స్కు వ్యతిరేకంగా ఈ తనిఖీలు జరిగాయి. ముంబై, పుణెల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ సీఈవో శిభాషిష్ సర్కార్, సెలబ్రిటీలు, టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు సహా 30 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు జరిగాయి.
తన నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడుల మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్స్కు తాప్సీ కూడా రియాక్టయ్యారు. ఆర్థిక మంత్రి చాలా బాగా చెప్పారని, ప్రభుత్వ విధానాలను అనుసరించాల్సిందేనన్నారని, కానీ దీన్ని సంచలనం చేయొద్దని తాప్సీ కోరారు.