దళితులు ఆర్థిక పరిపుష్టి సాధించి ఆత్మగౌరవంతో జీవించేలా దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టగా ఆ ఫలాలు చేరువవుతున్నాయి. ముఖ్యమంత్రి దత్తత గ్రామం తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో 76 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.7.60 కోట్లు సర్కారు జమ చేయగా యూనిట్ల ఎంపికపై అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అవగాహన కల్పించారు. తొలుత 10 మందికి యూనిట్లు (ఏడుగురికి ట్రాలీ ఆటోలు, ఇద్దరికి
ట్రాక్టర్డోజర్లు, ఒకరికి ప్యాసింజర్ ఆటో) ఎంపిక చేయగా బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి లబ్ధిదారులకు అందజేయనున్నారు.
తుర్కపల్లి, అక్టోబర్ 26 : దళితులందరూ ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు, ఆత్మగౌరవంతో జీవించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ‘దళితబంధు’ పథకం ప్రవేశపెట్టారు. తన దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిని రెండోసారి సందర్శించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆ గ్రామానికి దళితబంధును ప్రకటించారు. గ్రామంలో 2600 జనాభాకు 302 మంది ఎస్సీలు ఉన్నారు. ఇందులో 59 గృహాలుండగా 76 మంది దళితులను దళితబంధు పథకం కింద ఎంపిక చేశారు. ఎంపికైన వారి ఖాతాల్లో సెప్టెంబర్ నెలలో రూ.7.60 కోట్లు జమ అయ్యాయి.
క్షేత్రస్థాయిలో అధికారుల సర్వే
దళిత కుటుంబాలు తమ కాళ్లపై నిలబడాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ఎస్సీ కార్పొరేషన్, ఇతర జిల్లా అధికారులు 15 రోజులపాటు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆర్థిక స్థితిగతులు, విద్య, వారు చేస్తున్న పని, వారికి ఉన్న అనుభవంపై పూర్తిస్థాయిలో సర్వే జరిపారు. ఇచ్చిన నిధులు వృథా కాకుండా ఏదో ఒక ఉపాధి కల్పించాలని వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఏ యూనిట్లను చేపడుతారో తెలుసుకొని.. ఇప్పటికే యూనిట్లను నిర్వహిస్తూ లాభాలను గడిస్తున్న వారి వద్దకు తీసుకెళ్లి క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు. చివరికి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా స్థానికంగా ఉంటూ స్వయం ఉపాధిని సాధించేందుకు వీలుగా యూనిట్లను మంజూరు చేశారు.
పది మందికి శాశ్వత ఉపాధి యూనిట్లు
దళితబంధు పథకమంటే వాసాలమర్రి పేరు గుర్తుండిపోయేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. 76 మంది దళిత కుటుంబాలను ఎంపిక చేయగా ఇందులో 10 మందికి శాశ్వత ప్రాతిపదికన యూనిట్లను మంజూరు చేశారు. ఏడుగురికి ట్రాలీ ఆటోలు, ఇద్దరికి ట్రాక్టర్ డోజర్లు, ఒకరికి ప్యాసింజర్ ఆటో అందించనున్నారు. ఇందులో గ్యార ఆండాలు, బొట్ల నాగమణికి ట్రాక్టర్ డోజర్లు, చెన్నూరి కైలాశ్, చెన్నూరి పోచమ్మ, చెన్నూరి ఆండాలు, దుబ్బాసి లక్ష్మి, చెన్నూరి లలిత, చెన్నూరి ప్రవళిక, చెన్నూరి కవితకు ట్రాలీ ఆటోలు, చెన్నూరి లక్ష్మికి ప్యాసింజర్ ఆటోను మంజూరు చేశారు.
నేడు యూనిట్ల అందజేత
10 మందికి లబ్ధిదారులకు బుధవారం వాసాలమర్రి గ్రామ రైతువేదిక ఆవరణలో ఉదయం 11 గంటలకు యూనిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు యూనిట్లు అందించనున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, డీఆర్డీఏ పీడీ ఉపేందర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ పాల్గొంటారు.