ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ తెచ్చుకునే లబ్ధిదారులకు ఊరట కలిగించేందుకు కొత్త రేషన్ దుకాణాలను అందుబాటు లోకి తెస్తున్నది. ఇప్పటికే అర్హులైన వారికి కొత్త రేషన్కార్డులు ఇవ్వగా లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. 300 నుంచి 400 కార్డులకు ఒక రేషన్ దుకాణం ఉండేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రతి తండాలోనూ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,082 రేషన్ షాపులు ఉండగా కొత్తగా మరో 362 (నల్లగొండ 180, సూర్యాపేట 135, యాదాద్రి భువనగిరి 47) ఏర్పాటయ్యే
అవకాశం ఉంది.
సూర్యాపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువకాబోతున్నది. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రతి నెలా ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తోంది. గతంలో ఉన్న లబ్ధిదారులు కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఇటీవలే ప్రభుత్వం కొత్త కార్డులు అందించింది. నల్లగొండ జిల్లాలో గతంలో 4,64,807 కుటుంబాలకు కార్డులు ఉండగా కొత్తగా 11,395కార్డులు, సూర్యాపేటలో 3,16,566 కార్డులు ఉండగా కొత్తగా మరో 9,373, యాదాద్రిభువనగిరి జిల్లాలో గతంలో 2,13,805 కార్డులు ఉండగా కొత్తగా 5,934కార్డులు అందించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గతంలో 9,95,178 కార్డులు ఉండగా కొత్తగా మరో 26,702 కార్డులు అందించింది. ఇప్పుడు కొత్తగా రేషన్ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది.
300నుంచి 400కార్డులకో రేషన్ షాపు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో లేవు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కిలోమీటర్ల కొద్ది వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రజల బాధలను గుర్తించిన ప్రభుత్వం కొత్తగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసి దూరభారం తగ్గించాలనే ఆలోచన చేస్తోంది. 300నుంచి 400 రేషన్కార్డులకు ఒక దుకాణం ఏర్పాటు చేసే అంశంపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే ఉన్న రేషన్ షాపులకు తోడు అదనంగా మరో 362వరకు కొత్తవి ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ 300నుంచి 400కార్డులకో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని యోచిస్తుండగా రెవెన్యూ అధికారులు ఈ మేరకు పాత, కొత్త కార్డుల ప్రకారం లెక్కలు తీస్తున్నారు. కొత్తగా ఎక్కడెక్కడ దుకాణాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయనే దానిపై అంచనాలు రూపొందిస్తున్నారు. ప్రతి తండాకు ఒక షాపు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండగా ఆయా తండాల్లో తక్కువ కార్డులు ఉంటే సమీప లేదా ఇతర తండాలను కలపనున్నారు.
తగ్గనున్న దూరభారం
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా కొత్తగా సుమారు 362 రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 10,21,880 రేషన్ కార్డులు ఉండగా వీటిలో నల్లగొండ జిల్లాలో 4,76,202, సూర్యాపేటలో 3,25, 939 యాదాద్రిభువనగిరి జిల్లాలో 2,19,739 ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 991, సూర్యాపేటలో 610, యాదాద్రి జిల్లాలో 481మొత్తం కలిపి 2082 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లాలో 135, నల్లగొండ 180, యాదాద్రిలో 47 షాపుల చొప్పున మొత్తంగా 362దుకాణాల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే కసరత్తు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో దుకాణం దక్కించుకునే నిరుద్యోగికి ఓ మేరలో ఆదాయం సమకూరేలా కార్డులు ఉండాలనే ఆలోచనతో షాపుల సంఖ్యల్లో కొంతమేర మార్పులు జరుగవచ్చని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద కొత్తగా వచ్చే రేషన్ దుకాణాలతో నిరుద్యోగులకు ఉపాధి కలుగనుండడంతో పాటు రేషన్ సరుకులు తీసుకునే వారికి దూరభారం తగ్గనుంది.
మా కష్టాలు తీరుతయ్
మాది అక్కలదేవిగూడెం. మా ఊరు గతంలో చివ్వెంల కింద ఉండేది ప్రస్తుతం కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. రేషన్బియ్యం కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చివ్వెంల మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి దుకాణం మూసి ఉంటే మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తోంది. మా ఊర్లో రేషన్ దుకాణం ఏర్పాటుతో కష్టాలు పోతయ్.
ప్రజలకు ఇబ్బందులు ఉండవ్
రేషన్ దుకాణాలు పెంచితే ప్రజలకు ఇబ్బందులు పోతయ్. పెరుగుతున్న జనాభాతో పాటు రేషన్ దుకాణాలను పెంచాలనే నిర్ణయం బాగుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకే దగ్గరకు వచ్చి గుంపులు గుంపులుగా ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల పెంపుతో ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి.
కొత్త దుకాణాల ఏర్పాటు కసరత్తు నడుస్తోంది
ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాలు చాలాచోట్ల లబ్ధిదారులకు అందుబాటులో లేనందున ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త దుకాణాల ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది. ప్రతీ 300నుంచి 400కార్డులకో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కొత్త దుకాణాలు ఏర్పాటు విషయమై రెవెన్యూ అధికారులు లెక్కలు తీస్తున్నారు.