చిలిపికృష్ణుడి చిద్విలాసం
యాదాద్రిలో అంగరంగ అలంకారసేవలు
ఉదయం వటపత్రశాయి.. సాయంత్రం పొన్నవాహన సేవ
యాదాద్రి, మార్చి 19 : ఆబాలగోపాలం అలరించేలా యాదాద్రి లక్ష్మీ నరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అలంకార సేవల్లో భాగంగా ఐదోరోజైన శుక్రవారం స్వామివారు ఉదయం వటపత్రశాయి అలంకార సేవలో, రాత్రి కల్పవృక్ష సమాన బాసుడై పొన్న వాహనంపై బాలాలయంలో ఊరేగారు. తొలుత బాలాలయంలో వేకువజామున ద్వారతోరణ పూజ, ధ్వజకుంభారాధన, అగ్ని ఆరాధన, మూలమంత్ర, పంచసూక్త హవనం పూజలను ఆలయ ప్రధానార్చకులు, యాజ్ఞీకులు, రుత్వికులు, పారాయణీకులు, అర్చక బృందం వైభవంగా నిర్వహించి నిత్య పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం దేవదేవుడిని వటపత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించారు. రుత్వికులు, వేదపండితులు స్వామివారి అలంకార సేవ ముందు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూలమంత్రజపాలు చేశారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారిని మంగళకరమైన వాయిద్యాలతో ఊరేగించారు. వటపత్రశాయి విశిష్టతను భక్తులకు ప్రధానార్చకులు వివరించారు. వటపత్రశాయి అనగా మర్రి ఆకుపై శ్రీస్వామి, అమ్మవారికి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తకోటికి దర్శింపజేయడం.
యాదాద్రికి కుంభమేళా జలాలు
శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుంభమేళా గంగా జలాలను స్వామివారికి సమర్పించారు. సుమారు రెండునెలల క్రితం యాదాద్రి నుంచి సైకిల్యాత్రను ప్రారంభించి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి గంగా జలాలను తీసుకొచ్చినట్లు యాత్రికుడు గౌరీశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషితోనే యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నదన్నారు. కుంభమేళాలో భాగంగా నాగసాధువులు చేసిన ప్రాంతం నుంచి గంగా జలాలు తెచ్చినట్లు చెప్పారు.