Sumanth | సినిమా ప్రపంచంలో కొన్ని పాత్రలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి గుర్తింపు పొందిన పాత్రల్లో ఒకటి ‘సీతారామం’ చిత్రంలోని మేజర్ తారిక్ పాత్ర. ఈ పాత్రలో నటించిన సుమంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి వెంకటేష్, సిద్ధు, రాహుల్ రవీంద్రన్ తదితరులు హాజరై సందడి చేశారు.
వేదికపై మాట్లాడిన సుమంత్ ‘సీతారామం’ చిత్రాన్ని గుర్తు చేస్తూ సరదాగా వ్యాఖ్యానించారు.
“ఆ సినిమాలో నా పాత్ర వల్లే రామ్, సీత విడిపోతారు. అసలు నేను సీతకు క్షమాపణ చెప్పే ఒక దృశ్యం ఉంది. కానీ అది చివరకు చూపించలేదు. అందుకే అప్పటి నుంచి ఆ బాధ అలాగే ఉంది. ఇప్పుడు అందరి ముందూ మృణాల్కు క్షమాపణ చెబుతున్నాను” అని అన్నారు. ఆయన మాటలు వినగానే సభలో నవ్వులు పూశాయి. సుమంత్ క్షమాపణలకు వెంటనే మృణాళ్ కూడా సరదాగా స్పందించింది. ఒక సినిమాతో ఈ క్షమాపణలు సరిపోవు. ఇంకా మూడు నాలుగు సినిమాల్లో అవకాశాలు ఇస్తేనే మీ సారీని పరిగణలోకి తీసుకుంటాను అంటూ నవ్వుతూ కౌంటర్ ఇచ్చింది.
వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అడివి శేష్ నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్తో పాటు ప్రేమకథను కలగలిపిన కథగా రూపొందింది. ఆయన ఎప్పటిలాగే భిన్నమైన కథను ఎంచుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో అడివి శేష్, మృణాళ్ జంటగా కనిపించనుండగా, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.మొత్తానికి, ఒక పాత సినిమా జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ వేదికపై జరిగిన ఈ సరదా ఘటన ప్రేక్షకులను అలరించడంతో పాటు చిత్రానికి మరింత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది.