ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 22: విద్యార్థులు పట్టుదలతో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించినప్పుడే విద్యకు సార్థకమవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనురాగ్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ ‘దక్ష-2022’ను ప్రారంభించారు.
సాంకేతిక, నిర్వాహక నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేలా విద్యార్థులను మరింత ప్రోత్సహించాలని అధ్యాపకులకు సూచించారు. వర్సిటీ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విజ్ఞానంతోపాటు నైపుణ్యాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ‘దక్ష-2022’లో 150కిపైగా ఈవెంట్లు ఉంటాయని, వీటికి దేశవ్యాప్తంగా 114 సంస్థల నుంచి దాదాపు 2,500 రిజిస్ట్రేషన్లు వచ్చాయని నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎమ్ఎస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కృష్ణకాంత్, వర్సిటీ సీఈవో నీలిమ, ఇంచార్జి వైస్ చాన్సలర్ బాలాజీ, రిజిస్ట్రార్ సమీనా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.