“సాంబయ్యా! అదేంటి ఇంకా ఇలా కూర్చున్నావు. బట్టలు మార్చుకోలేదు. అసలు బట్టలు సర్దుకున్నావా? మన ఊరివాళ్లంతా బస్సెక్కి రెడీగా ఉన్నా రు. నువ్వు బస్సెక్కితే బయల్దేరడమే! నువ్వు ఆలస్యం చేస్తే అక్కడ పెళ్లి ముహూర్తానికి అందుకోలేం” కరణం శివరాం.. సాంబయ్యను తొందరపెట్టాడు. సాంబయ్యకు ఏడుపు ఒక్కటే తక్కువ! ఏం చెప్పాలి? ఏదో చెప్పాలి! అది కూడా అతికేట్లు! “నేను రాలేనురా! నాకు ఒంట్లో బాగోలేదు”.
“నీ మొహం! నువ్వు రాకుండా నీ కొడుకు పెండ్లి ఎలా జరుగుతుంది? ఆ మహాతల్లి బతికి ఉంటే, వారం కిందటే కొడుకు దగ్గరికి వెళ్లేది. లేలే! తయారుగా! నువ్వు కూడా పదిరోజుల ముందు బయల్దేరి వెళ్లాల్సింది” కోప్పడ్డాడు శివరాం.
“ఆ! నేను పోతే ఇక్కడి పొలం పనులో?”.
“మేము లేమూ! మీ పాలేర్లు లేరూ! నీ చాదస్తం ఎక్కువై దగ్గరుండి పొలం పనులు చేస్తున్నావు? నీ పొలాన్ని ఏ దొంగలూ ఎత్తుకుపోరు గాని బయల్దేరు!” అంటూ.. కరణం శివరాం అతణ్ని కుర్చీలోంచి లేవదీయబోయాడు చనువుగా.
“చెప్పానుగా ఒంట్లో బాగోలేదని! మీరెళ్లండి!”.
“అరే! ఏమైందిరా నీకు!”.
“ఏమో! ఒకటే విరేచనాలు! గంటగంటకూ పోవాల్సి వస్తోంది. పైగా కడుపునెప్పి!”.. కొంచెం మూలుగుతూ చెప్పాడు సాంబయ్య.
“మందులు వేసుకుందువు పద!”.
“వద్దు! నా కోసం మిమ్మల్నందర్నీ ఇబ్బంది పెట్టలేను. మాటిమాటికీ బస్సు ఆపడం పద్ధతి కాదు. మీరు వెళ్లండి. తగ్గిన తర్వాత నేనే వస్తాను” చెప్పాడు సాంబయ్య. తప్పించుకోవడానికి!
“‘నాన్న రాలేదా?’ అని మల్లికార్జున్ అడిగితే ఏం చెప్పాలి! ఇది మీ ఇంట్లో పెండ్లి. నువ్వే పెద్దవి! అక్కడ మీ వియ్యంకులు ఎలా ఫీలవుతారు?”.
“సారీ! నువ్వెన్ని చెప్పినా వచ్చే ఓపిక నాకు లేదు. సుబ్బరాజు డాక్టర్కు ఫోన్ చేశాను. ఇంటికి వచ్చి బాటిల్సు పెడతానన్నాడు. నాకు తగ్గేదాకా ఇక్కడే ఉంటాడట! తగ్గిన తర్వాత నేను కారు మాట్లాడుకొని వస్తాలే! ఆలస్యమవుతోంది.. మీరు బయల్దేరండి!”.
శివరాం ఎంత బలవంతపెట్టినా లొంగలేదు సాంబయ్య. అతనికోసం యాభై మందిని బస్సులో నిలబెట్టడం బాగుండదని శివరాం వెళ్లిపోయాడు. అతని మూర్ఖత్వానికి విచారిస్తూ.. ‘మొండిమనిషి’ అని తిట్టుకున్నాడు. అతను పోగానే సాంబయ్య దుఃఖం కట్టలు తెంచుకుంది.
సాంబయ్య, పార్వతమ్మ దంపతులకు లేక లేక కలిగిన సంతానం మల్లికార్జున్! ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచారు. చిన్నప్పటినుంచే పట్టణంలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచి చదివించాడు. మంచి మంచి కాలేజీ చదువులు చెప్పించాడు. సాంబయ్య పొలాలు ఒకేడు పండితే.. ఇంకో ఏడు పండవు. నీటి సౌకర్యం తక్కువ. అయినా కొడుక్కు ఏలోటూ కలుగకుండా చదివించాడు. అమెరికాలో ఎం.ఎస్ చేస్తానంటే, కొన్ని ఎకరాలు అమ్మి అతణ్ని అమెరికా పంపించాడు.
ఐదేండ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చాడు. కానీ, తండ్రిని చూడ్డానికి అతనికి టైం దొరకలేదు. తనే పట్టణానికి పోయి చూసి వచ్చాడు. ఇంకో ఏడాదికి అతనికి అమెరికా సంబంధం కుదిరింది. గౌరి డిప్యూటేషన్ మీద అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది. ఆఫీసులో పరిచయం పెంచుకొని ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించింది. ఆమె తల్లిదండ్రుల అభీష్టానికి విలువిచ్చి, ఇండియాకు వచ్చి పెండ్లికి సిద్ధమైంది.
అసలు సమస్య ఇక్కడే వచ్చింది. గౌరి తల్లిదండ్రులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు. సాంబయ్యకు చదువు రాదు. స్టేటస్ లేదు. గౌరి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వారికి సాంబయ్యతో వియ్యమందడం ఇష్టం లేదు. ఆ విషయాన్ని మల్లికార్జున్కు చెప్పింది గౌరి.
గౌరి మోజులో ఉన్న మల్లికార్జునుడు.. తండ్రితో సంప్రదించకుండానే పెండ్లి నిశ్చయం చేసుకున్నాడు. చదువురాని తన తండ్రి పెండ్లిలో ఎలా మెసులుతాడోనని భయపడుతున్నాడు.
నిజానికి ఎవరికీ చెప్పకుండానే పెండ్లి చేసుకొందామని అనుకొన్నాడు. కానీ, ‘నీ తరఫున కనీసం యాభై మందన్నా రాకపోతే మాకు తలవంపులుగా ఉంటుంది’ అని మామగారు హెచ్చరించాడు. నాలుగు రోజుల్లో పెండ్లి ఉంది. కొనాల్సినవి చాలా ఉన్నాయి. కాలేజీ, యూనివర్సిటీ ఫ్రెండ్స్ను స్వయంగా వెళ్లి పిలవాలి. ఈ బిజీ షెడ్యూల్లో తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఊరి నుంచి ఒక బస్సు జనాల్ని పెండ్లికి తోలమని. కొడుకు మాటలు చెవిలో గింగురుమంటున్నాయి.
“నాన్నా! నా పెండ్లికి ఊరి నుంచి యాభైమందైనా రావాలి! లేకపోతే నా పరువు పోతుంది. శివరాం అంకుల్కు చెప్పి బస్సు మాట్లాడి పంపే బాధ్యత నీది! నువ్వు వచ్చేట్లయితే ఆ ముతక బట్టలు మానేసి, కొంచెం డాబుసరి బట్టలు వేసుకొని రా! వస్తే ఇక్కడ ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకు. ఒక చిరునవ్వుతో ఓ మూలన కూర్చో! నేను పరిచయం చేస్తే ‘హలో’ అను చాలు! పెండ్లి లో ఏ మాత్రం పొరపాటు జరిగినా గౌరికి ఇష్టముండదు. ఆమె ముక్కోపి! వాళ్ల పేరెంట్స్ చాలా కల్చర్డ్ పీపుల్! మట్టి పిసుక్కునే వాళ్లంటే వాళ్లకు అసహ్యం! కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి! మాకు సెలవులు అయిపోవచ్చాయి. మూడు రోజుల్లో తిరుగు ప్రయాణం! అందుకే ఈసారి మనింటికి రాలేకపోయాను. ఏమీ అనుకోవద్దు!”.. ఇంకా ఏవేవో అన్నాడు గానీ, అవి విని జీర్ణించుకునే శక్తి సాంబయ్యకు ఆ భగవంతుడు ఇవ్వలేదు.
కాసేపటికి సుబ్బరాజు వచ్చాడు. అతను ఆర్ఎంపీ డాక్టర్. డిగ్రీ లేకపోయినా అనుభవం బాగుంది. రాగానే ఫ్లూయిడ్స్ పెట్టాడు. కొన్ని ఇంజెక్షన్లను ఆ బాటిల్కే ఇచ్చేశాడు. పల్స్ చూశాడు. ఎన్నిసార్లు అయ్యిందని ఎంక్వయిరీ చేశాడు.
“సారీ డాక్టర్! ఇది నా స్వయంకృతం! నాకు చదువురాదు గదా! నేను ఎందుకూ పనికిరాను. పొద్దున తలనొప్పి మాత్రలు అనుకొని, మోషన్ ట్యాబ్లెట్లు వేసుకున్నాను. విరేచనాలు మొదలైన తర్వాత నేను చేసిన తప్పు.. నాకు తెలిసి వచ్చింది. జ్వరం, తలనొప్పి తగ్గలేదు కానీ, అనవసరంగా ఇదొకటి తగిలింది..” చెప్పాడు సాంబయ్య. దాని లో కొంత నిజం ఉంది. కొంత అబద్ధం ఉంది.
“ఏం ఫర్వాలేదు.. కరణంగారు ఫోన్ చేసి, మీకు వెంటనే తగ్గించి చెన్నై పంపమన్నాడు..” సుబ్బరాజు యథాలాపంగా చెప్పాడు.
సాంబయ్య మౌనం వహించాడు. కాసేపాగి..
“అవును! రేపు ఉదయం మా అబ్బాయి పెండ్లి ఉంది. కానీ, ఈ కండిషన్లో నేనెలా పోగలను. పోయి అందరినీ ఎలా ఇబ్బంది పెట్టగలను?” బేలగా అన్నాడు సాంబయ్య.
“అదీ పాయింటే! ఇంకో జబ్బయితే ఫర్వాలేదు. ఇది చాలా డేంజరస్! అప్పుడే డీహైడ్రేషన్ మొదలైంది” చర్మాన్ని సాగదీస్తూ చెప్పాడు సుబ్బరాజు.
“అది ఆ కరణం గాడికి అర్థం కాదు!”..
నిష్టూరంగా అన్నాడు సాంబయ్య.
“వర్రీ కాకండి! నేను చెబుతాను. రెండు బాటిల్స్ ఎక్కించి వెళ్తాను. మళ్లీ రాత్రికి రెండు ఎక్కిస్తాను. రేపు ఉదయానికి నార్మల్ అవుతుంది. అప్పుడు పెండ్లికి వెళ్లండి” చెప్పాడు సుబ్బరాజు.
“కానీ, పెండ్లయిన తర్వాత వెళ్తే నన్ను చూసి లోకం ఏమనుకుంటుంది? రేపు కూడా బాటిల్స్ ఎక్కించు!” అర్థించాడు సాంబయ్య.
“చూద్దాం! రేపు పరిస్థితిని బట్టి నిర్ణయిస్తాను”.
ఓ గంట తర్వాత సుబ్బరాజు వెళ్లిపోయాడు.
సాంబయ్య ఒంటరిగా ఉండటంతో ఆలోచనలు చుట్టుముట్టాయి.
‘తను చేసిన తప్పు ఏంటి? చిన్నప్పటినుంచీ మల్లిగాడిని గారాబంగా పెంచడమా? వాడికి బాగా చదువు రావాలని వేరేచోట పెట్టి చదివించడమా? పై చదువులకు అమెరికా పంపడమా? చిన్నప్పుడే వీడిని రెసిడెన్షియల్ స్కూలులో వదలడం వల్ల ఆత్మీయత, అనుబంధాలు తగ్గిపోయాయి. సెలవులకు ఇంటికి వచ్చినా, ఇక్కడి వాతావరణం నచ్చక ఎప్పుడెప్పుడు పట్టణానికి పారిపోదామని చూస్తూ ఉండేవాడు. పార్వతైనా వాడి మనస్తత్వం గుర్తించలేదు. తండ్రి అంటే కొంచెం కూడా గౌరవం చూపడు. వాడికి తన ఆస్తి కావాలి కానీ, తను అక్కరలేదు. ఏదో మొక్కుబడిగా పెండ్లికి పిలిచాడు. తండ్రిని పిలిచే పద్ధతి అదేనా! తను అక్కడికి పోతే.. నలుగురి ముందు చులకన చేస్తే.. తన పరువు ఏం కావాలి! అందుకే పోలేకపోయాడు. వాడి పెండ్లి చూడకపోయినా నష్టంలేదు. వాడు సుఖంగా ఉంటే చాలు. కోడలు బుద్ధిమంతురాలైతే చాలు. కానీ, ఈ సంబంధం తమ అంతస్తుకు మించింది. అసలు వీడిని గౌరవిస్తారో లేదో! చదువు చెప్పించకపోయినా తన కండ్లముం దు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ఇన్ని ఎకరాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.ఆ రాత్రి శివరాత్రే అయ్యింది సాంబయ్యకు. తెల్లారి రాములోరి గుడికి పోయి, కొడుకు పేరు మీద కల్యాణం చేయించాడు. అందరికీ పండ్లు పంచిపెట్టాడు.
మరునాడు శివరాం వచ్చాడు. పెండ్లి విశేషాలు చెప్పాడు. తన సెల్ఫోన్లో తీసిన ఫొటోలు చూపించాడు. మల్లికార్జున్ సూటులో దొరబాబులా మెరిసిపోతున్నాడు. కోడలు గౌరి మహాలక్ష్మిలా ఒంటినిండా నగలతో మెరిసిపోతున్నది. వియ్యంకుడు, వియ్యపురాలు పెద్ద జమీందారుల్లాగా ఉన్నారు. కల్యాణమండపం తన ఊహకు అందనిది. భోజనాలు ఎన్నో రకాలు! అన్ని రకాలుంటాయని సాంబయ్యకు తెలియదు. వందలమంది అతిథులు హాజరయ్యారు. వైభవంగా జరిగింది పెండ్లి.
అన్నీ చూపించి సాంబయ్యకు బట్టలు ఇచ్చాడు.. వియ్యంకులు ఇమ్మన్నారని చెప్పి. కవరు విప్పి బయటికి తీశాడు. అతిసాధారణ ముతక పంచెలు!
“ఇవేం బట్టలురా శివరాం?!”.. అడిగాడు సాంబయ్య విస్మయంగా.
“బస్సులో వెళ్లిన అందరికీ ఇలాంటివే పెట్టారు! మనవాళ్లు మురిసిపోయారు” చెప్పాడు శివరాం.
“కానీ, ఇవి వాళ్ల స్థాయికి తగ్గట్టు లేవుగా!”.
“అబ్బే! వాళ్లు వచ్చిన వాళ్ల స్థాయిని బట్టి బట్టలు పెట్టారు. మనం మట్టి పిసుక్కునే మనుషులం గదా! మనకెందుకు పట్టువస్త్రాలని.. రోజూ పనికొచ్చేవి పెట్టారు ఘనంగా! సంతోషించు”.
“సరేలే! ఎవరి పెండ్లయినా జరిగితే నేను ఇంతకంటే మంచి బట్టలే పెడుతూంటాను! ఇవి పాలేర్లకు ఇచ్చినా నా పరువు పోతుంది. ఇంట్లో అలుకు గుడ్డలుగా ఉపయోగపడతాయిలే! ఇంతకూ మా వాడు ఏమన్నాడు”.. ఆతృతతో అడిగాడు.
శివరాం తడబడ్డాడు. ‘చెప్పాలా! వద్దా!’ అన్న ట్లు ఆలోచించి తలూపాడు. సాంబయ్య అది కనిపెట్టి.. ‘ఫర్వాలేదు చెప్పు’ అని సైగ చేశాడు.
“నాన్నకు థ్యాంక్స్ చెప్పమన్నాడు. ఈ సారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తానన్నాడు. ఈ సారి పట్టణంలో ఇల్లు కొంటానన్నాడు. రెండు రోజుల్లో అమెరికా వెళ్లాలన్నాడు. చేరిన తరువాత ఫోన్ చేస్తానన్నాడు” అంటూ శివరాం తల తిప్పుకున్నాడు.
“చాలు! చాలు! వాడి సుఖమే నేను కోరుకునేది” అన్నాడు సాంబయ్య.
ఒక ఐదు రోజులు గడిచిపోయాయి. సాంబయ్య కొడుకు ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఒక సాయంత్రం సెల్లు రింగయ్యింది.
“హలో!’ అన్నాడు.
“ఎవరు మాట్లాడుతున్నది? సాంబయ్యా?” అటునుంచి దర్పంగా అడిగారు.
“అవును, మీరెవరు?”.
“నేను.. గౌరి తండ్రిని!”.
“నమస్కారం.. బాగున్నారా?”.
“ఆ! ఆ! నమస్కారాలకేం గానీ, అర్జెంటుగా నీకో విషయం చెప్పాలి”.
“అంతా బాగున్నారా.. బావగారు!”.
“నన్ను చెప్పనియ్యవయ్యా! నువ్వు వెంటనే బయల్దేరు”.
“ఎక్కడికి? అమెరికాకా?”.
“కాదు, చెన్నైకి. నీ కొడుకు నీ కోసం కలవరిస్తున్నాడు”.
“రాంగ్ నెంబర్ లాగుంది. నా కొడుకు అమెరికా వెళ్లాడు” అంటూ ఫోన్ పెట్టేశాడు సాంబయ్య.
కాసేపటికి మళ్లీ రింగయ్యింది.
“హలో సాంబయ్యా! మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తావేంటి! చెప్పేది విను. అర్జెంటుగా బయల్దేరి చెన్నై రావాలి!”.
“ఎందుకు?”.. విసుగ్గా అడిగాడు సాంబయ్య.
“నీ కొడుకు మల్లికార్జున్ పిలుస్తున్నాడు”.
“అబ్బే! మా వాడు అమెరికా..”.
“ఆగు! అతను అమెరికా పోలేదు. పోబోయే ముందు యాక్సిడెంట్ అయ్యింది. ఓ కార్పోరేటు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. కండిషన్ సీరియస్ ఏం కాదు కానీ.. లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి! అర్థం అయ్యిందా! నేను గౌరి తండ్రిని.. ప్రొఫెసర్ను!”.. అటునుంచి దబాయింపు.
“అయ్యో! యాక్సిడెంటా! ఎలా ఉన్నాడు?”.
“ఫర్వాలేదు. ‘ఔట్ ఆఫ్ డేంజర్’ అన్నారు. కానీ, వెన్నెముక ఫ్రాక్చర్ అయ్యింది. కోలుకోవడానికి టైమ్ పడుతుంది. హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ అతనికి చేసేవాళ్లు ఎవరూ లేరు. నువ్వు వస్తే..”.
“హలో! మా కోడలు గౌరి ఉందిగా అక్కడ”.. ఆదుర్దాగా అడిగాడు.
“లేదు! ఆమె అమెరికా వెళ్లిపోయింది!”.
“అదేంటి? మొగుడికి ఇలా ఉంటే ఎలా వెళ్లింది?”.. దిమ్మెరపోయి అడిగాడు.
“ఆమెకు లీవ్ దొరకలేదు. అందుకే వెళ్లిపోయింది”.. తాపీగా జవాబు చెప్పాడు.
“అరే! వాడికి బావమరుదులు, మరదళ్లు, అత్తామామలున్నారుగా చూసుకోవడానికి.. నేనెందుకు?” కాస్త బాధగా అడిగాడు.
“ఎంతైనా సొంతవాళ్లు ఉంటేనే బాగుంటుంది. మా అందరికీ పనులున్నాయి. అప్పటికీ ఒక రోజున్నాం! నిన్న స్పృహలోకి వచ్చినప్పటినుంచీ నిన్నే కలవరిస్తున్నాడు. వెంటనే వచ్చెయ్యి!”.
“అయ్యా! నాకు చదువురాదు. మొరటువాణ్ని. ఏదో సేద్యం చేసుకుంటూ బతుకుతున్నాను. వాడికి ఎలా సేవ చెయ్యాలో కూడా నాకు తెలీదు. చదువుకున్న పెద్ద మనుషులు మీరే వాణ్ని చూసుకుంటే బాగుంటుంది”.. అంటూ ఫోన్ పెట్టేశాడు సాంబయ్య. ఒళ్లంతా కంపరం పుడుతూంటే!
మళ్లీ రింగయ్యింది. ఎత్తలేదు.
ఓ గంటకు శివరాం వచ్చాడు.
“అదేంట్రా.. చెన్నైకి పోనన్నావుట!” ఆశ్చర్యంగా.. బాధగా అడిగాడు.
“ఏం.. ఆ వెధవ నీకు ఫోన్ చేశాడా?”.
“ఆ! చెయ్యక ఛస్తాడా? కన్నతండ్రివై ఉండి కొడుకు కోసం అక్కడికి పోనన్నావుట? నువ్వేం మనిషివని మీ వియ్యంకుడు ఆశ్చర్యపోతున్నాడు. ‘ఆ మాత్రం ప్రేమ లేదా?’ అని అడిగాడు”.. లాజిక్కు తెచ్చాడు శివరాం.
“ఆ! తండ్రి ఉన్నాడని వాడికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? వాళ్లు చదివినంత గొప్ప చదువులు, పోనీ ఆ మాటకొస్తే.. చదువే చదవలేదు. కానీ, మానవత్వమున్న ఎవరైనా వియ్యం అందుతున్నప్పుడు.. కనీసం పెండ్లి అప్పుడైనా వియ్యంకుడిని గౌరవిస్తారు. నా అనుమతి లేకుండా పెండ్లి నిశ్చయం చేసుకున్నారు. కనీసం సమాజం కోసమన్నా నాకు ఆహ్వానం పంపలేదు. అల్లుడు వస్తే చాలనుకున్నారు. కానీ, ఈ రోజు అల్లుడికి యాక్సిడెంట్ అయితే అతని తండ్రి గుర్తుకొచ్చాడు. ఎందుకు? సేవలు చేయడానికి! మళ్లీ అల్లుడు బాగు కాగానే.. వాడి తండ్రిని ఎడం కాలుతో తన్నడానికి..” సాంబయ్య కండ్లు వర్షించాయి.
శివరాం ఎంతో సేపు అతణ్ని ఓదార్చాడు. ఒప్పించి.. బయలు దేరతీశాడు. కార్ మాట్లాడుకొని, డాక్టర్ సుబ్బరాజును తోడు తీసుకొని సాంబయ్యను చెన్నై తీసుకువెళ్లాడు. హాస్పిటల్లో దిక్కులేని వాడిలాగా మల్లికార్జున్ పడి ఉన్నాడు. వార్డు బాయ్స్, నర్సుల దయమీద ముక్కుతూ, మూలుగుతూ యమబాధలు పడుతున్నాడు. తండ్రిని చూడగానే భోరున ఏడ్చేశాడు అంతకంటే ఎక్కువగా సాంబయ్య ఏడ్చాడు. శివరాం కూడా ఏడ్చాడు. డాక్టర్లు వచ్చి గట్టిగా కోప్పడేదాకా.. ఆ ఏడుపులు ఆగలేదు.
“ఏంటి పరిస్థితి డాక్టర్ గారు?”.. అక్కడికొచ్చిన డాక్టర్ను అడిగాడు సుబ్బరాజు.
“ఔట్ ఆఫ్ డేంజర్! కానీ, చాలాకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి! హాస్పిటల్లోనే కనీసం ఒక నెల ఉండాలి. ఇంటిదగ్గర ఆరునెలలన్నా మందులు వాడుతూ, ఫిజియోథెరపీ తీసుకోవాలి! అతను డ్యూటీలో చేరాలంటే ఒక సంవత్సరం పట్టవచ్చు”.
డాక్టర్ టెక్నికల్గా ఇంకా ఏవో వివరించాడు. అవి సాంబయ్యకు, శివరాంకు అర్థం కాలేదు. ఎందుకిలా అయిపోయింది వాడి బతుకు!
“డాక్టర్! అతను మామూలు మనిషి అయి.. మామూలు జీవితం గడుపుతాడా? అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకోగలడా?” అడిగాడు సాంబయ్య.
“అది చెప్పలేం. దేవుడి దయ!”.. నిర్లిప్తంగా చెప్పి వెళ్లిపోయాడు డాక్టర్.
“నాన్నా! నన్ను క్షమించు. ఈ వయసులో నీకు శ్రమ కలిగించాను”.
“మళ్లీ! నాదేముంది! నువ్వు ప్రేమించిన గౌరి ఏం చేస్తుందో!” సాంబయ్య ప్రశ్న.
ఆ! తండ్రి ఉన్నాడని వాడికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? వాళ్లు చదివినంత గొప్ప చదువులు, పోనీ ఆ మాటకొస్తే.. చదువే చదవలేదు. కానీ, మానవత్వమున్న ఎవరైనా వియ్యం అందుతున్నప్పుడు.. కనీసం పెండ్లి అప్పుడైనా వియ్యంకుడిని గౌరవిస్తారు. నా అనుమతి లేకుండా పెండ్లి నిశ్చయం చేసుకున్నారు. కనీసం సమాజం కోసమన్నా నాకు ఆహ్వానం పంపలేదు. అల్లుడు వస్తే చాలనుకున్నారు. కానీ, ఈ రోజు అల్లుడికి యాక్సిడెంట్ అయితే అతని తండ్రి గుర్తుకొచ్చాడు. ఎందుకు? సేవలు చేయడానికి!
కోపల్లె విజయ ప్రసాద్ (వియోగి)
కోపల్లె విజయ ప్రసాద్.. ‘వియోగి’ పేరుతో సుపరిచితులు. గుంటూరు జిల్లా తెనాలి ఈయన స్వస్థలం. ఎమ్మెస్సీ చదివారు. ఆ తర్వాత మరో ఐదు పీజీలు చేశారు. సంప్రదాయబద్ధంగా, విలువలతో కూడిన సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సాహిత్య సేవలో కొన్ని వందల కథలు, వందకుపైగా నాటికలు, నాటకాలు రాశారు. ఏడు నవలలు అందించారు. బాలసాహిత్యంలోనూ నాటికలు, శతాధిక కథానికలు రాశారు. ఇరవైకి పైగా కథా సంపుటాలను వెలువరించారు. 2002లో 60 కథలతో ప్రచురితమైన ‘విలువలు’, ఇటీవలే మరో 60 కథలతో వచ్చిన ‘పెరటిచెట్టు’ సంపుటాలు పాఠకుల మన్ననలు పొందాయి. ‘ఆగామి వసంతం’, ‘బంధాలు’ పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. అనేక బహుమానాలు, సన్మానాలతోపాటు జీవిత సాఫల్య పురస్కారం దక్కించుకొన్నారు. 1993లో ‘విలువలు’ రేడియో నాటకానికి ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతులమీదుగా బహుమతి తీసుకున్నారు. ఎన్.టి.ఆర్. పురస్కారంతోపాటు కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ బహుమతిని అందుకొన్నారు.
నమస్తే తెలంగాణ, ముల్కనూరు
ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన
‘కథల పోటీ-2020’లో
ప్రచురణకు ఎంపికైన కథ.
– కోపల్లె విజయ ప్రసాద్ (వియోగి)
77948 20104