న్యూఢిల్లీ : ఇండియన్ స్ప్రింటర్ హిమాదాస్ బుధవారం కరోనా బారినపడ్డారు. పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ‘కోలుకోవడంతో పాటు ఇంతకు ముందు కంటే బలంగా తిరిగి వచ్చేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి ఎదురు చూస్తున్నాను’ అని తెలిపింది. కొవిడ్ నుంచి సురక్షితంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించింది.
హిమాదాస్ 2018లో అండర్-20 ప్రపంచ చాంపియన్ షిప్లో 400 మీటర్ల ఈవెంట్లో విజయం సాధించింది.. ఈ ఈవెంట్లో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయ స్ప్రింటర్గా నిలిచింది. జూలై-ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్కు ఆమె అర్హత సాధించలేకపోయింది. కండరాల ఒత్తిడి కారణంగా ఆమె కొంతకాలం విరామం తీసుకోగా.. ఈ నెల 10న పాటియాలా చేరుకుంది. ఈ నెల 8, 9 తేదీల్లో గౌహతిలో ఉన్న సమయంలోనే కొద్ది అలసిపోయినట్లుగా కనిపించినా.. ఆందోళన చెందాల్సిన పని లేదని అనుకున్నామని, అయితే పాటియాలాలో కరోనా పరీక్షలు నిర్వహించిన సమయంలో కరోనా పాజిటివ్గా తేలిందని ఆమె కోచ్ గలీనా బుఖరినా తెలిపింది. ప్రస్తుతం హిమ కామన్వెల్త్, ఆసియా గేమ్స్పై దృష్టి పెట్టింది.