న్యూఢిల్లీ, అక్టోబర్ 25: దేశంలో నైరుతి తిరోగమనం సోమవారంతో సంపూర్ణమైంది. సాధారణంతో పోల్చితే ఈ ఏడాది నైరుతి ఆలస్యంగా తిరోగమించింది. 1975 నుంచి చూస్తే ఆలస్యంగా తిరోగమించిన నైరుతిల్లో ఇది ఏడవది అని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. నైరుతి తిరోగమనం పూర్తైన సోమవారమే ఈశాన్య రుతుపవనాల వ్యాప్తి ప్రారంభమైనట్టు ఐఎండీ తెలిపింది. దక్షిణ భారతంలో ఈశాన్య పవనాలు వీస్తున్నట్టు పేర్కొన్నది. సాధారణంగా సెప్టెంబర్ 17న నైరుతి తిరోగమనం ప్రారంభం కావాలి. కానీ ఇటీవలి కాలంలో రుతుపవనాల తిరోగమనం ఆలస్యం అవుతున్నది. ఈ ఏడు అక్టోబర్ 6న ప్రారంభం అయింది. నైరుతి ప్రభావంతో జూన్-సెప్టెంబర్ మధ్య దేశంలో సాధారణ వర్షపాతం నమోదైంది. దేశవ్యాప్తంగా సగటున 87 సెంటీమీటర్ల వాన కురిసింది.