‘జాతిరత్నాలు’ చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో నవీన్ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రం ద్వారా కల్యాణ్శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆదివారం నవీన్ పొలిశెట్టి జన్మదినం సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘ఆద్యంతం హాస్యరసభరితంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. నవీన్ పొలిశెట్టి సరికొత్త అవతారంలో దర్శనమిస్తారు. వినోదమే పరమావధిగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, లక్ష్మీసౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తారు.
న్యూఏజ్ ఎంటర్టైనర్
నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఇందులో ఓ ప్రధాన పాత్రలో అనుష్క నటిస్తున్నది. మహేష్బాబు దర్శకుడు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెలాఖరున చిత్రీకరణలో నవీన్ పొలిశెట్టి పాల్గొనబోతున్నాడు .ఆదివారం ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ‘న్యూఏజ్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో తెరకెక్కించబోతున్నాం. త్వరలో టైటిల్ను ప్రకటిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.