ఆలయాల్లో వెల్లివిరిసిన వరలక్ష్మీ శోభ
లక్ష్మీ..మంగళగౌరీ…జయశుభకారిణీ…విజయరూపిణీ….వరాల తల్లీ..మము కరుణించుమమ్మా…అని భక్తిప్రపత్తులతో అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆ తల్లిని మనసారా పూజించి, అర్చించి….నోములు, వరలక్ష్మీ వ్రతాలతో పవిత్ర శ్రావణ శుక్రవారం ఇంటింట, వాడవాడలా, ఆలయాలలో సుమంగళులు కొలిచి తరించారు. ఎటు చూచినా అమ్మవారి వరలక్ష్మీ వ్రతాల సందడి నెలకొంది.
మాదన్నపేటలో….
మాదన్నపేట కూరగాయల మార్కెట్లో ఉన్న భూలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో స్థానిక మహిళలు ,మహిళా రైతులు శ్రీ వరలక్ష్మీ వ్రతం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం అమ్మవారిని సుందరంగా అలంకరించి,అభిషేకాలతో పూజించారు.
శేరిలింగంపల్లిలో …
శేరిలింగంపల్లిలోని పలు దేవాలయాల్లో వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక, సంక్షేమబోర్డు ఛైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ , శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్యాదవ్ దంపతులు గచ్చిబౌలిలోని స్వగృహాంలో వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సైదాబాద్లో….
శ్రావణమాస శుక్రవారాన్ని పురస్కరించుకుని మలక్పేట నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో వరలక్ష్మీవ్రతాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. సైదాబాద్ మాతామైదానంలోని విజయ దుర్గాలయం, జీవన్జ్యోతి జయదుర్గా ఆలయం, ఏపీఏయూ కాలనీలోని ధర్మనిలయం, హరిహర క్షేత్రం, లక్ష్మీనగర్కాలనీలోని షిర్డిసాయి బాబా ఆలయంలోని కనుకదుర్గా మాత ఆలయం, శ్రీవేంకటేశ్వర ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
బండ్లగూడలో…..
శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాలలో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని రాంబాగ్ భవాని మాత దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కందుకూరులో…..
శ్రావణమాసం రెండవ శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీ వ్రతాలను మండలంలో కన్నుల పండవగా జరుపుకున్నారు. మండలంలో ఎక్కడ చూసిన శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాల సందడి కనిపించింది.
మణికొండలో…..
శ్రావణ శుక్రవారం కావడంతో గండిపేట మండలంలోని పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మణికొండలోని శ్రీశ్రీశ్రీ పార్వతీరామలింగేశ్వరాలయం, పుప్పాలగూడలోని కాశీవిశ్వేశ్వరాలయం, మంచిరేవులలోని వీరభద్రస్వామి ఆ లయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవాలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వ హించారు.
శంషాబాద్లో…
శంషాబాద్ పట్టణంలోని స్థానిక వెంకటేశ్వరాయంలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. సంతోషిమాత, బాలాజీ,ధర్మగిరి, శ్రీరామనగరం, అష్టలక్ష్మీ ఆలయం, శివాలయం, సిద్దులగుట్ట ఆలయాలలో అమ్మవారిని దర్శించుకొని పసుపు,కుంకుమలు సమర్పించారు. కుంకుమార్చనలు చేశారు. మహా మంగళహారతులు సమర్పించారు.