ప్రపంచ వ్యాప్తంగా మానసిక సమస్యలున్నా.. చికిత్స తీసుకోనివారిలో మూడొంతుల మంది ఇండియా, చైనా దేశాల్లోనే ఉన్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్కు చెందిన ప్రొఫెసర్ విక్రమ్ పటేల్ బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. మానసిక వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడం, మానసిక నిపుణులు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం, ఉన్నా తమ గ్రామాల్లో వైద్యం లభించకపోవడం.. లాంటివి ఒక కారణమైతే; మానసిక వైద్యంపై ఉన్న అపోహలు ఈ పరిస్థితికి మరో కారణంగా చెబుతున్నారు అధ్యయనకారులు. చైనాలో సైకోటిక్ వ్యాధులతో బాధపడుతున్నవారిలో 40 శాతం మందికి చికిత్స అందడం లేదు. కాగా, మనదేశంలో ప్రతి 10 మంది మానసిక రోగుల్లో ఒకరికి మాత్రమే సరైన వైద్యం లభిస్తుండటం విచారకరం.