సంస్థ ప్రమోటర్లపై రెండేండ్ల నిషేధం
రూ.8.2 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ, మార్చి 23: దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ప్రమోటర్లు, మరికొందరిపై క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించింది. మోసపూరిత కార్యకలాపాలు, తప్పుడు సమాచారం, నిబంధనల ఉల్లంఘనలకుగాను ఏడాది నుంచి రెండేండ్ల వరకు సెక్యూరిటీల మార్కెట్ జోలికి రాకుండా నిషేధం విధించింది. అలాగే సంస్థతోపాటు ఆయా వ్యక్తులపై రూ.8.2 కోట్ల జరిమానాలనూ వేసింది. ఆర్థిక సంవత్సరాలు 2008-09 నుంచి 2011-12 వరకు తమ ఆర్థిక ప్రకటనల్లో డీసీహెచ్ఎల్ రుణాలను తక్కువగా చూపిందని, మోసపూరితంగా వ్యవహరించిందని తాజాగా విడుదల చేసిన ఓ ఆదేశంలో సెబీ పేర్కొన్నది. ఈ క్రమంలోనే డీసీహెచ్ఎల్పై రూ.4 కోట్లు, ప్రమోటర్లు టీ వెంకట్రామిరెడ్డి, టీ వినాయక్ రవిరెడ్డిలతోపాటు పీకే అయ్యర్పై రూ.1.30 కోట్ల చొప్పున జరిమానాలు వేసింది. అలాగే ఎన్ కృష్ణన్కు రూ.20 లక్షలు, వీ శంకర్కు రూ.10 లక్షల ఫైన్ విధించింది. వీరంతా నిషేధిత కాలంలో సెక్యూరిటీల్లో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా కొనడం లేదా అమ్మడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది.
విచారణ ఆధారంగా..
ఇన్సైడర్ ట్రేడింగ్, ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ కార్యకలాపాల ఆరోపణలకుగాను డీసీహెచ్ఎల్పై 2011 అక్టోబర్ నుంచి 2012 డిసెంబర్ వరకు సెబీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు చర్యలు తీసుకున్నది. తీసుకున్న రుణాల సమాచారాన్ని దాచిపెట్టిందని, వడ్డీ చెల్లింపులు, ఇతర చార్జీల వివరాలను ఖాతా పుస్తకాల్లో పేర్కొనలేదని తమ విచారణలో తేలినట్టు సెబీ ఈ సందర్భంగా తెలియజేసింది. రుణ బకాయిలను దక్కన్ క్రానికల్ మార్కెటీర్స్ (డీసీఎం)కు బదిలీ చేశారని, తద్వారా మదుపరులు, వాటాదారులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి డీసీహెచ్ఎల్ చైర్మన్గా వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్గా అయ్యర్ పారదర్శకమైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంలో విఫలమయ్యారని ప్రకటించింది.