హైదరాబాద్ : ప్రముఖ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. బొల్లారంలోని మారుతీనగర్కు చెందిన నర్సింహులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాసరి నారాయణరావు వద్ద నర్సింహులు 2012 నుంచి 2016 వరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సినిమాల రిస్టోరేషన్ పనులు చేశాడు. దాసరి మృతి తర్వాత పెండింగ్ డబ్బుల చెల్లింపులో అరుణ్కుమార్, ప్రభులతో నర్సింహులుకు వివాదం తలెత్తింది. అయితే, ఈ నెల 13న డబ్బులు ఇస్తామని ఇంటికి పిలిచి కులం పేరుతో అరుణ్కుమార్ తనను దూషించారంటూ నర్సింహులు ఇటీవల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో దాసరి ఇద్దరు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్థిక పరమైన లావాదేవీలపై తనను బెదిరించినట్లు సోమేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం విధితమే.